ఆరు హామీలకు తెల్ల కార్డు అర్హత పట్ల సందేహం

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హామీలను అమలు చేసేందుకు దరఖాస్తులను స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడాన్ని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ స్వాగతించారు.  అయితే, కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుకు తెల్ల రేషన్ కార్డు ప్రధాన అర్హతగా పేర్కొనడం పట్ల సందేహం వ్యక్తం చేశారు.

“రాష్ట్రంలో గత పదేళ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాయి” అని ఆయన గుర్తు చేశారు.  ఇంకా ‘లక్షలాది కుటుంబాలవారు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వేచిచూస్తున్నారని పేర్కొన్నారు. వాళ్లందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. 

తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలని కోరారు. త్వరలో స్థానిక, పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయని చెబుతూ అంతలోపే లబ్ధిదారులను గుర్తించాలని కోరారు. ఎన్నికల సాకుతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగా దరఖాస్తులకే పరిమితం కావొద్దని సంజయ్ హెచ్చరించారు. 

నిజమైన లబ్ధ్దిదారులను గుర్తించే విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఆయన కోరారు.  ప్రాంతీయ పార్టీ అయినా బిఆర్‌ఎస్ ను అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు తిరస్కరించడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీదారు కానేకాదని సంజయ్ స్పష్టం చేశారు ఈ ఎన్నికల్లో బిజెపి అత్యధిక మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం తథ్యం అంటూ ధీమా వ్యక్తం చేశారు. 

శ్వేతపత్రం..స్వేదపత్రం అంటూ అక్షరాలు మార్చి ఒకరికొకరు పత్రాలు రిలీజ్ చేసుకుంటున్నారని అంటూ కాంగ్రెస్, బిఆర్ఎస్ లపై మండిపడ్డారు. రూ. 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టిస్తే తెలంగాణలో రూ. 6.75 లక్షల కోట్ల అప్పులు ఎట్లా చేశారు? అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలంటూ హామీలిచ్చిన కాంగ్రెస్ అసలు అప్పులను ఎట్లా తీరుస్తారు? 6 గ్యారంటీల అమలుకు నిధులెక్కడి నుండి తీసుకొస్తారు? మీ ప్రణాళిక ఏమిటి? సంపదను ఏ విధంగా సృష్టిస్తారు? అప్పుల ఊబిలో చిక్కుకున్న తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతే సంస్థ సమావేశాలకు ప్రభుత్వం నిధులెట్లా విడుదల చేస్తుంది? దీనివల్ల ముస్లిం పేద సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఉగ్రవాదులను తయారు చేయడంతోపాటు బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడే సంస్థ తబ్లిక్ జమాతే సంస్థకు నిధులివ్వడం వెనుక ఉద్దేశమేందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.