ఎరుమేలి వద్ద రోడ్డుపై అయ్యప్ప స్వాముల ఆందోళన

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వాములతో కిక్కిరిసిపోతోంది. మకరజ్యోతిని మించిన రద్దీ శబరిమలలో కనిపిస్తుంది. మండల పూజల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి అయ్యప్పలు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎరుమేలికి వచ్చే వాహనాలను ఎంఈఎస్ కాలేజీ వద్ద పోలీసులు నిలిపివేస్తున్నారు. 

సుమారు నాలుగు గంటల పాటు పోలీసులు వాహనాలను నిలిపివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ వాహనాలను అనుమతించాలని ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు చెందిన పలువురు అయ్యప్ప స్వాములు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.

కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా శబరిమలలో భక్తుల రద్దీ కనిపిస్తోందని ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసులు, కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదని అయ్యప్పలు ఆరోపిస్తున్నారు.  దీంతో పంబ నుంచి సన్నిధానం వరకు భారీగా క్యూలైన్‌లు నిలిచిపోయాయి.

ఈనెల 27తో మండల పూజలు ముగియనున్నాయి. వరుస సెలవులు రావడంతో కూడా అయ్యప్పలు భారీగా శబరిమలకు వెళ్తున్నారు.  దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఎరుమేలిలో వాహనాలను నిలిపివేస్తున్నారు. అటు అనూహ్య రద్దీ కారణంగా వర్చువల్ క్యూ బుకింగ్‌లను తగ్గించేందుకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు చర్యలను చేపట్టింది.

కేరళ   హైకోర్టు ప్రత్యేక విచారణ

ఇలా ఉండగా, శబరిమలలో రద్దీ అనూహ్యంగా పెరిగి భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ వచ్చిన వార్తలపై కేరళ హైకోర్టు స్పందించింది. సోమవారం స్పెషల్‌ సిట్టింగ్‌ నిర్వహించి ట్రావంకోర్‌ దేవస్వంబోర్డు (టీడీబీ)కు, ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. భక్తుల కోసం మార్గమధ్యలో ఏర్పాటు చేసిన ‘ఎడతవలం’ (తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు)ల వద్ద మంచినీరు, అల్పాహారం అందజేయాలని ఆదేశించింది.
 
భక్తులు, పిల్లలు ఎలాంటి ఆహారం, నీరు లేకుండా దాదాపు 12 గంటల పాటు వాహనాల్లో రోడ్లపైనే ఉండిపోవాల్సి వస్తోందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొంది. సన్నిధానం వద్ద కూడా గంటల కొద్దీ భక్తులు క్యూ లైన్లలో నిల్చోని ఉండాల్సి వస్తుండడాన్నీ గమనించింది. అదనపు పోలీసు బలగాలను పంపించి రద్దీని నియంత్రించాలని డీజీపీని ఆదేశించింది. 
 
ఆదివారం ఒక్క రోజే 1.2 లక్షల మంది భక్తులు వచ్చినట్టు టీడీబీ వర్గాలు తెలిపాయి. సోమవారం వారి సంఖ్య మరింతగా పెరిగిందని పేర్కొన్నాయి. సోమవారం 88వేల మంది వర్చువల్‌ క్యూ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారని, పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోని వారు కూడా వచ్చారని అధికారులు చెప్పారు.