కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి

 
* ఎన్నికలప్పుడే కనిపించే రాహుల్ `ఎన్నికల గాంధీ’
కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.  హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలని డీఎంకే నేత హేళన చేసినపుడు ఎన్నిక‌లప్పుడ మాత్ర‌మే క‌నిపించే ఎన్నిక‌ల గాంధీ అదే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.  ‘‘సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు ఏఐసీపీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదు. డీఎంకే నేతలు దేశాన్ని విఛ్ఛిన్నం చేసేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎందుకు అదుపు చేయడం లేదు?” అంటూ ఆమె నిలదీశారు.
 
ఒక జాతీయ మీడియాకు ఆమె ఇచ్చిన ఇంట‌ర్య్వూలో మాట్లాడుతూ, కొన్ని వర్గాల ఓట్ల కోసం దురదృష్టవశాత్తు కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే పార్టీ నాయకులు విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా కొంత మంది నేతలు వ్యాఖ్యలు ఉన్నాయని ఆమె విమర్శించారు. ఒక రాష్ట్రంలో ఓట్ల కోసం దేశాన్ని అవమానించడం సరికాదని ఆమె హితవు చెప్పారు.
 
ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో రాహుల్ గాంధీ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ గాంధీ వైఖరిని వెల్లడించాలని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అంటూ ఆమె దుయ్యబట్టారు.  దేశాన్ని ఐక్యం చేయడానికి భారత్ జోడో యాత్ర చేశానని రాహుల్ గాంధీ చెబుకుంటున్నారని, కానీ అందుకు వ్యతిరేకంగా వారి మిత్రపక్షం చేస్తున్న వ్యాఖ్యలపై మాత్రం పట్టనట్టు ఉంటున్నారని కవిత విమర్శించారు. భారత్ జోడో యాత్ర అన్నది కేవలం ప్రచారం కోసమే అన్నది తేలిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు.

కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినేలా సనాతన ధర్మాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే సీరియస్‌గా తీసుకొని రాహుల్ గాంధీ స్పందించి ఉంటే పదేపదే ఇలా వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదని ఆమె తెలిపారు. కేవలం ఎన్నికలప్పుడే పనిచేసే రాహుల్ గాంధీని అందరూ `ఎన్నికల గాంధీ’ అని పిలుస్తారని కవిత ఎద్దేవా చేశారు. 

దేశ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని, ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ జవాబుదారిగా ఉండాలని ఆమె స్పష్టంచేశారు. దేశానికి రాహుల్ గాంధీ ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. కార్మికుల పట్ల గౌరవం ఉందని, హిందీ మాట్లాడే రాష్ట్రాలను అవమానించరాదని, హిందూ వ్యతిరేకి కాదని రాహుల్ గాంధీ చెప్పాలని  ఆమె హితవు చెప్పారు. 

వలస కార్మికులంటే ప్రగతిలో భాగస్వాములని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అన్నారని ఆమె గుర్తు చేశారు. ఆ కార్మికుల పట్ల తమ పార్టీకి అపారమైన గౌరవం ఉందని ఆమె చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీకి అలాంటి గౌరవమర్యాదలేవీ లేవని క‌విత ధ్వజమెత్తారు.

కాగా, కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని రాహుల్ గాంధీ వెల్లడించాలని కవిత డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏవేవో హామీలు ఇస్తుందని, కానీ ఎన్నికల తర్వాత వాటిని విస్మరిస్తుందని ఆమె ఆరోపించారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై కవిత స్పందిస్తూ వాటి అమలుకు తెలంగాణ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇస్తామని ఆమె చెప్పారు. ఆలోగా అమలు చేయకపోతే ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంతో కచ్చితంగా  పోరాడుతామని ఆమె హెచ్చరించారు.  బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఆరు నెలల నుంచి కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆమె పేర్కొంటూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు.