కరీంనగర్- తిరుపతి రైలు వారానికి ఇక 4 రోజులు

కరీంనగర్ నుండి తిరుపతి వెళ్లే రైలు ఇకపై వారానికి నాలుగు రోజులపాటు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రస్తుతం ఆదివారం, గురువారం మాత్రమే నడిచే ఈ రైలు ఇకపై వారంలో 4 రోజులపాటు నడవనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ న్యూఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి రైల్వే పెండింగ్ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. 
 
ఈ సందర్భంగా కరీంనగర్ నుండి తిరుపతి వెళ్లే రైలు ప్రయాణీకులతో విపరీతమైన రద్దీ ఏర్పడినందున  వారానికి 4 రోజులపాటు పొడిగించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజల ఆకాంక్ష మేరకు కరీంనగర్ – హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే పనులు వెంటనే పూర్తి చేసి కొత్త రైల్వే లేన్ పనులను మంజూరు చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు.

రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం వ్యాపారులు, సామాన్య ప్రజలు నిత్యం జమ్మికుంటకు రాకపోకలు కొనసాగిస్తుంటారని, వారి సౌకర్యార్థం పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను జమ్మికుంట స్టేషన్ లో ఆపే (హాల్ట్) విధంగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు.

మరోవైపు పెద్దపల్లి-నిజామాబాద్ రైల్ల్వే లేన్ కు సంబందించి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారి దుర్వాసన వెదజల్లుతుండటంతో ప్రజల నుండి అనేక ఫిర్యాదులొస్తున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని 11ఎ, 16ఎ, 26, 101, 123ఏ, 134ఏ, 140ఏ, 164, 175ఏ, 775 ల వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్ యూబీ) డ్రైనేజీలను మంజూరు చేయాలని సంజయ్ కోరారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.