గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్‌ అధ్యక్షుడు

గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్‌ అధ్యక్షుడు

వచ్చే ఏడాది నిర్వహించే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ హాజరుకానున్నారు. ప్రధాని కార్యాలయం ఆయనకు ఆహ్వానం పంపినట్లు కేంద్ర అధికారిక వర్గాలు తెలిపాయి. ఇరుదేశాల మధ్య అభివృద్ధి చెందిన సాన్నిహిత్యం, విశ్వాసానికి నిదర్శనంగా ఈ ఆహ్వానం నిలుస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

ఈ ఏడాది జులైలో పారిస్‌లో జరిగిన ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవ బాస్టిల్‌ డే పరేడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా నిర్వహించిన జి 20 సదస్సులో మాక్రాన్‌ పాల్గొన్నారు.   గతేడాది ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌సిసి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడం ఇది ఆరవసారి. మాక్రాన్‌కు ముందు మాజీ ఫ్రెంచ్‌ అధ్యక్షుడు జాక్వైస్‌ చిరాక్‌ వరుసగా 1976, 1988లో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1980, 2008, 2016 సంవత్సరాల్లో వరుసగా మాజీ అధ్యక్షులు గిస్కార్డ్‌ డి ఎస్టేయింగ్‌, నికోలస్‌ సర్కోజీ, ఫ్రాంకోయిస్‌ హోలండ్‌లు పాల్గన్నారు.

కాగా, ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హాజరు కావాల్సి ఉంది. ఇటీవలే ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా బైడెన్‌తో ప్రధాని మోదీ మాట్లాడారని, గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అధ్యక్షుడిని ఆహ్వానించినట్లు మనదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి గతంలో వెల్లడించారు. 

మోదీ ఆహ్వానాన్ని బైడెన్‌ కూడా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. దీంతో గణతంత్ర వేడుకలను బైడెన్‌ ముఖ్య అతిథిగా వస్తారని అంతా భావించారు. అయితే, ఆయన ఈ వేడుకలకు హాజరు కాకపోవచ్చని ఇప్పుడు  తెలియడంతో  తాజాగా మాక్రాన్‌ను భారత్‌ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్‌ తన మిత్ర దేశాల నేతలను ఆహ్వానించడం 1950 నుంచి సంప్రదాయంగా వస్తున్నది.