పాక్ దివాళాకు భారత్, అమెరికా కారణం కాదు

పాకిస్థాన్ దివాలా తీయడానికి కారణం భారత్‌, అమెరికాలు కాదంటూ ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. మన దరిద్రానికి మనమే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మన కాళ్లను మనమే నరుక్కున్నామంటూ పరోక్షంగా సైనిక నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.  2018 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిపి, వారికి (ఆర్మీ) నచ్చిన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దారని ఆయన మండిపడ్డారు. 

1993లో, 1999లో, 2017లో త‌మ ప్ర‌భుత్వాలను మిలిట‌రీనే కూల్చింద‌ని స్పష్టం చేశారు.  మ‌న విధానాలే మ‌న‌ల్ని ఆర్థిక సంక్షోభం దిశ‌గా తీసుకువెళ్లిన‌ట్లు చెబుతూ శ‌క్తివంత‌మైన సైన్యం వ‌ల్లే ఈ ప‌రిస్థితి త‌లెత్తిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. దీంతో దేశం ఆర్థికంగా దివాలా తీసిందని, ప్రజలు కష్టాలపాలయ్యారని ఆరోపించారు. ఈ మేరకు తన పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ పాక్ మూడుసార్లు ప్రధానిగా సేవలందించారు. జనవరిలో జరగనున్న ఎన్నికల్లో గెలిచి మరోసారి ప్రధాని కావాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పీఎంఎల్- ఎన్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారితో ఆయన తాజాగా భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా నవాజ్ మాట్లాడుతూ పాక్ ప్రస్తుత పరిస్థితికి, ప్రజల కష్టాలకు పక్క దేశాలు కారణం కాదని తెలిపారు. 

దేశంలో న్యాయవ్యవస్థ కూడా ఆర్మీకి వంత పాడుతుందని, ఆర్మీ నిర్ణయాలకు జడ్జిలు తలూపుతారని విమర్శించారు.  రాజ్యాంగ అతిక్రమణ జరుగుతున్నా కల్పించుకోరని, పార్లమెంట్ రద్దు చేస్తున్నామని ఆర్మీ ప్రకటన చేయగానే జడ్జిలు ఆమోదముద్ర వేస్తారని నవాజ్ షరీఫ్ మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయాలే దేశాన్ని అధోగతి పాలు చేశాయని, ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టాయని షరీఫ్ ఆరోపించారు