మొబైల్ నెట్‌వర్క్‌ను స్వాధీనం చేసుకొనే హక్కు

టెలికమ్యూనికేషన్స్ ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్రజా భద్రత లేదా పబ్లిక్ ఎమర్జెన్సీ సందర్భాల్లో ఏదైనా టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను కేంద్రం తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవచ్చు.  అలాగే టెలికాం వివాదాల పరిష్కారం, అప్పిలేట్‌ ట్రిబ్యునల్స్‌ రూపొందించేందుకు అవకాశం కల్పిస్తోంది.  గత వారం పార్లమెంట్ భద్రత ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో టెలికమ్యూనికేషన్స్ బిల్లు 2023ను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

‘‘విపత్తు నిర్వహణతో పాటు ఏదైనా పబ్లిక్ ఎమర్జెన్సీ సంభవించినప్పుడు లేదా ప్రజల భద్రత దృష్ట్యా.. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ప్రత్యేకంగా అధికారం పొందిన ఏదైనా అధికారి.. అధీకృత సంస్థ నుంచి ఏదైనా టెలికమ్యూనికేషన్ సర్వీస్ లేదా నెట్‌వర్క్‌ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవచ్చు’’ అని ముసాయిదా చట్టం (డ్రాఫ్ట్ లా) స్పష్టం చేసింది. 

అంతే కాకుండా,జాతీయ భద్రతా నిబంధన ప్రకారం నిషేధిస్తే తప్ప అక్రిడిటేషన్ ఉన్న మీడియా వ్యక్తుల నుండి వచ్చే సందేశాలను కూడా అడ్డగించరాదని బిల్లు పేర్కొంది.  ‘‘భారతదేశంలో ప్రచురించడానికి ఉద్దేశించిన పత్రికా సందేశాలు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన కరస్పాండెంట్‌లు సబ్-సెక్షన్ (2)లోని క్లాజ్ (a) ప్రకారం ప్రసారం చేయడాన్ని నిషేధిస్తే తప్ప, వాటిని అడ్డుకోవడం లేదా నిర్బంధించడం జరగదు’’ అని ముసాయిదా బిల్లు పేర్కొంది. 

ప్రజల భద్రత దృష్ట్యా  వ్యక్తుల మధ్య ఏదైనా సందేశాన్ని నిరోధించడాన్ని ప్రభుత్వం నిర్దేశించవచ్చని కూడా ఈ చట్టం వెల్లడించింది. ఇది టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను నిలిపివేయడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. ఒకవేళ మెసేజ్‌లను చట్టవిరుద్ధంగా అడ్డగిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.2 కోట్ల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రెండు శిక్షలూ విధించవచ్చని బిల్లు చెబుతోంది. 

ఈ కొత్త ముసాయిదా చట్టం ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885, ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫీ చట్టం 1933, టెలిగ్రాఫ్ వైర్స్ (చట్టవిరుద్ధమైన స్వాధీనం) చట్టం 1950లను రీప్లేస్ చేయనుంది. ఆ చట్టాలు 138 ఏళ్ల నాటి పాతవి కావడం, సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో కొత్త చట్టం అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది.