మిడ్ మానేర్ బాధితుల సమస్యలు పరిష్కారించాలి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కరీంనగర్ జిల్లా మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించడం పట్ల  బిజెపి ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్‌కుమార్ హర్షం ప్రకటించారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్రాసిన బహిరంగ లేఖలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను వివరిస్తూ ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లించాలని కోరారు.

నీలోజిపల్లి నుండి నందిగామ, ఆగ్రహారం వరకు ఇండస్ట్రీయల్ కారిడార్‌ను, స్కిల్ డెవలెప్ మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న ఓ ప్రజా ప్రతినిధి సహా వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

అంతేగాక, అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సహా మాజీ కేసీఆర్ కుటుంబ సభ్యులై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇందుకోసం తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 
 
 త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా అకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని సంజయ్ చెప్పారు. అదే విధంగా 2009 కొత్త గెజిట్ ప్రకారం 2015 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ,యువకులకు ముంపు పరిహారం, పట్టా ఇస్తానని ఇచ్చిన హామీ నేటికి ముందుకు పడలేదని పేర్కొంటూ దీనిపై పరిశీలించాలని కోరారు. 
 
రెండేళ్ల క్రితం మిడ్ మానేర్ ముంపు బాధితుల కోసం కొదురుపాకలో నిర్వహించిన అఖిల పక్ష మహాధర్నాలో పాల్గొన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేస్తూ మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.