బిగ్‌బాస్‌ సీజన్‌-7 విజేతగా రైతు బిడ్డ ప్రశాంత్

బిగ్‌బాస్‌ సీజన్‌-7 విజేతగా రైతు బిడ్డ ప్రశాంత్
యూట్యూబర్‌, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-7 విజేతగా నిలిచాడు. దీంతో బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారిగా కామన్‌మెన్‌ కేటగిరీలో విజేతగా నిలిచిన పోటీదారుడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇక రన్నరప్‌గా సీరియల్‌ నటుడు అమర్‌దీప్‌ నిలిచాడు.  దాదాపు 105 రోజుల నుండి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 7 ఫినాలే ఘట్టం ఆదివారం ముగిసింది.
టాప్ 6 పోటీదారులుగా ఉన్న పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌ దీప్‌, ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌, అంబటి అర్జున్‌‌లలో.. అర్జున్ టాప్ 6 స్థానం, ప్రియాంక టాప్ 5, ప్రిన్స్ యావర్ టాప్ 4, రూ. 15 లక్షలతో హౌస్‌ నుండి ఎలిమినేట్ అయ్యారు.  విన్నర్, టాప్ 2, టాప్ 3 స్థానాల విషయంలో కాసేపు ఉత్కంఠని కలిగించినా ముందుగానే వచ్చిన లీక్‌ల మాదిరిగానే ఈ షో‌లో ఒక్కొక్కరూ ఎలిమినేట్ అయ్యారు.
ఫైన‌ల్‌గా ఎమ్ ఎమ్ కీరవాణి చెప్పిన ‘భూమి బిడ్డ’నే బిస్‌బాస్ సీజన్ 7 ట్రోపీని కైవసం చేసుకున్నారు. ‘రైతు బిడ్డ’ పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్, ఫైనల్‌‌లో విజేతగా నిలిచారు.   ట్రోఫీతో పాటు రూ. 35 లక్షల నగదు, మారుతి సుజుకీ కారు, రూ. 15 లక్షల విలువచేసే జాస్ అలుక్కాస్ బంగారంను గెలుచుకున్నారు.
కింగ్ నాగార్జున పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినట్లుగా ప్రకటించడంతో.. పల్లవి ప్రశాంత్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక టాప్ 2, రన్నర్‌గా అమర్ దీప్ నిలిచాడు. టాప్ 3 స్థానంతో శివాజీ సరిపెట్టుకున్నాడు.  హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి వారిని స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. అనంతరం బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ పేరును ప్రకటించారు.

బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ముగించుకొని బ‌య‌ట‌కు వ‌చ్చిన అనంత‌రం మీడియాతో ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ముచ్చడిస్తూ రైతుబిడ్డ‌ను గెలిపించిన మీ అంద‌రికి రుణ‌ప‌డి ఉంటాన‌ని ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ చెప్పాడు. `నేను కాదు గెలిచింది మీరు’ అంటూ అభిమానుల‌ను ఉద్దేశించి  సంతోషం వ్యక్తం చేశారు.  ఒక కామ‌న్ మ్యాన్ గెలుస్తాడా..లేదా..అనే ప‌ట్టుద‌ల‌తో బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టాన‌ని, అభిమానులే తనను గెలిపించార‌ని ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ తెలిపారు. తనకు ఓటు వేసిన ప్ర‌తి ఒక్క‌రికి రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పారు.

ఇలా ఉండగా, బిగ్ బాస్ 7 తెలుగు ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు అయినప్పటికీ వాటిలో నుంచి ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షలు తీసుకొని  టాప్ 4 కంటెస్టెంట్ గా తీసుకెళ్లిపోవడంతో ప్రైజ్ మనీ రూ. 35 లక్షలకు తగ్గింది. రూ. 5 లక్షలను ప్రశాంత్ ఇది వరకు చెప్పినట్లుగానే పేద రైతులకు అందించనున్నట్లు వేదికపై ప్రకటించారు. ఇక కారును తండ్రికి, జోయాలుకాస్ నగలను తల్లికి ఇస్తున్నట్లు వెల్లడించారు. 
ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ షూటింగ్‌ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్‌కు అమర్‌, ప్రశాంత్‌ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ప్రశాంత్‌ విజేత అని ప్రకటించగానే సంబురాలు చేసుకున్నారు. అయితే ఇరువురి అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం పరస్పర దాడులకు దారితీసింది. ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. అటుగా వెళ్తున్న హెచ్‌సీయూ డిపోకు చెందిన సిటీ బస్సుపై దాడిచేసి అద్దాలు పగలగొట్టారు.
 
దీంతోపాటు హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అమర్‌దీప్‌ కారును చుట్టుముట్టి దాడిచేశారు. కారు అద్దాలు పగలగొట్టి బయటకు దిగాలంటూ నినాదాలు చేశారు. దీంతో కారులో ఉన్న అమర్‌ తల్లి, ఆయన భార్య భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు