15 రోజులు ముందే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు!

తెలంగాణాలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు 15 రోజులు ముందుగానే జరగవచ్చని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పడంతో రాజకీయంగా ఆసక్తి చెలరేగుతుంది.  నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో  ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని, ఫిబ్రవరి మొదటి వారం నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని మంత్రివర్గ సమావేశం సందర్భంగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు.
 
ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని, అయినప్పటికీ మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పటిలాగే లోక్‌సభ ఎన్నికలతో జరుగుతాయనేది మాత్రం ఇప్పటికే స్పష్టమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి అయితే ఏమాత్రం లేదు. ఒకవేళ.. ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసినా.. ఎన్నికలకు 6 నెలల కంటే తక్కువే గడువు ఉంది కాబట్టి ఎప్పటిలాగే నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారనేది సుస్పష్టం.

ఇక కిందటిసారి సార్వత్రిక ఎన్నికలకు 2019 మార్చి 18న నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరిగింది. ఏపీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి విడతలోనే ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. దేశంలో అన్ని దశల పోలింగ్ పూర్తైన తర్వాత మే 23న ఫలితాలను విడుదల చేశారు.

 
ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. వైఎస్ జగన్ 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.  అంటే ప్రస్తుత ప్రభుత్వానికి 2024 మే 30 వరకు గడువు ఉంది. నిబంధనల ప్రకారం ఈ లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాల్సి ఉంటుంది. సాధారణంగా గడువు పూర్తవడానికి 3 నెలల ముందే ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తుంది. 
 
ప్రభుత్వ కాలపరిమితి పూర్తవడానికి 40 నుంచి 50 రోజుల ముందే ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ మూడో వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.  అయితే, లోక్‌సభ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు ఉండడం, అందులోనూ మొదటి విడతలోనే ఏపీ ఎన్నికలు ఉండే అవకాశం ఉండడంతో అంతకంటే 40 రోజుల ముందే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

కిందటిసారి సార్వత్రిక ఎన్నికలకు 2019 మార్చి 18న నోటిఫికేషన్ విడుదలైంది. కాబట్టి ఆ లెక్కన చూసుకున్నా ఈసారి 2024 మార్చి మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతకంటే 15 రోజుల ముందే నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. అదే నిజమైతే మార్చి మొదటి వారంలోనే ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావొచ్చు! అంటే ఇంకో 70 -75 రోజుల్లో ఏపీలో ఎన్నికల పక్రియ ప్రారంభం కానుంది.