లోక్ సభలో అలజడి వెనుక అసలు కుట్రదారులెవ్వరు?

 
* “భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్” పేరుతో సోషల్ మీడియా గ్రూప్
*ఐదంచెల భద్రతలో వైఫల్యం ఎక్కడ జరిగింది?

పార్లమెంట్‌లోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి అలజడి సృష్టించిన నేపథ్యంలో పార్లమెంట్ వద్ద చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలు కొత్త పార్లమెంట్ వద్ద భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. గతంతో పోలిస్తే పార్లమెంట్ వద్ద భద్రతా వ్యవస్థ మరింత మరింత పటిష్టం చేసినప్పటికీ స్మోక్ బాంబులతో ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీలోకి ఎలా ప్రవేశించగలిగారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

 కాగా, ఈ దాడిలో నలుగురు పాల్గొన్నట్టు తొలుత పోలీసులు వెల్లడించారు. కానీ, ఇందులో మొత్తం ఆరుగురు పాల్గొన్నట్టు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న యువకులు సాగర్ శర్మ, మనో రంజన్‌లు ఛాంబర్‌లోకి దూకి కలర్ స్మోక్ స్ప్రే చేశారు. 

ఇదే సమయంలో పార్లమెంట్ బయట ఉన్న అమోల్ షిండే, నీలం దేవి కౌల్‌లు ఎరుపు, పసుపు రంగు క్యానన్లు స్ప్రే చేసి, రాజ్యాంగాన్ని రక్షించాలి, భారత్ మాతాకీ జై అంటూ పెద్దగా నినాదాలు చేస్తూ పరుగెత్తారు. పార్ల‌మెంట్ వెలుప‌ల క‌ల‌ర్ స్మోక్‌ను వ‌దిలిన వారిని నీలం ఆజాద్ (42), అమోల్ షిండే(25) గా గుర్తించారు.

వీరితో పాటు గురుగ్రామ్‌కు చెందిన లలిత్ ఝా, విక్కీ శర్మలు కూడా పాల్గొన్నట్టు పోలీసులు చెప్పారు. లలిత్ ఝా ఇంటిలోనే వీరంతా బస చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకూ ఐదుగుర్ని అరెస్ట్ చేశామని, మరొకరి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

ఏడాది క్రితమే మైసూర్ లో సమావేశమైన బృందం

అయితే, ఈ ఆరుగురు పైకి కనిపించేవారు గాని అసలు కుట్రదారులు వేరేవారున్నారని, వారు కొంతకాలంగా రేకి నిర్వహిస్తున్నారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. వీరంతా `భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్’ పేరుతో ఓ సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసుకొని సమాచారం పంపుకొంటున్నట్లు కనుగొన్నారు. సాగర్ శర్మ స్వస్థలం యూపీలోని లక్నో కాగా మనో రంజన్, అమోల్ షిండే మహారాష్ట్రలోని లాతూర్, నీలం హరియాణాలోని హిస్సార్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరికి ఆన్‌లైన్‌లోనే పరిచయం ఏర్పడిందని తెలిసింది.  వీరంతా ఒక ఏడాది క్రితమే మైసూర్ లో సమావేశమైన్నట్లు కనుగొన్నారు.

సాగర్ గత జూన్ లోనే ఢిల్లీకి వచ్చినా పార్లమెంట్ లో ప్రవేశింపలేక పోయారు. వీరంతా డిసెంబర్ 10న ఎవరికి వారుగా ఢిల్లీకి చేరుకున్నారు. వారి ఢిల్లీ గెట్ వద్ద కలుసుకోగా, అక్కడనే రంగుల క్రాకర్స్ ను పంపిణి చేశారు.  లోక్‌స‌భ విజిట‌ర్స్ గ్యాల‌రీ నుంచి స‌భ‌లోకి దూకి ఆందోళ‌న చేసిన వారిని సాగ‌ర్ శ‌ర్మ‌, డీ మ‌నోరంజ‌న్‌(35)గా పోలీసులు గుర్తించారు.  వీరిద్ద‌రూ కూడా క‌ర్ణాట‌క‌లోని మైసూర్‌కు చెందిన వార‌ని పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.

నీలంకు కిసాన్ మోర్చా మద్దతు
 
కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా 2020లో జరిగిన రైతుల ఆందోళనలో నీలం పాల్గొన్నట్లు ఆమె సోదరుడు తెలిపాడు. అయితే, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పాడు. పైగా, ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం సంయుక్త కిసాన్ మోర్చా ఆమెకు మద్దతుగా వచ్చి, ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఆమె రైతుల ఉద్యమంలో పనిచేశారని కూడా నిర్ధారించింది.
 
పైగా, నిరుద్యోగం కారణంగా ఆమె పార్లమెంట్ పై దాడికి పూనుకున్నారంటూ కిసాన్ మోర్చా నేతలు సమర్థిస్తున్నారు. అంతేగాక, కిసాన్ మోర్చా నేత ఆజాద్ పాల్వా ఆమె ఇంటికి వెళ్లి సంఘీభావం ప్రదర్శించారు కూడా. ఆమెను విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తూ ఈ విషయమై కిసాన్ మోర్చా గురువారం సమావేశం అవుతుందని ప్రకటించారు.
 
అయితే, నీలం రాజకీయ కార్యకర్త అని, కొంతకాలంగా పలు ఆందోళనలతో పాల్గొంటున్నాడని పోలీసులు గుర్తించారు. రైతుల నిరసనలలోనే కాకుండా ఇటీవల మహిళా క్రీడాకారుల నిరసనలతో కూడా పాల్గొన్నారు. బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్, లోక్ దళ్ ల ఎన్నికల ప్రచారాలలో పాల్గొన్నట్లు కూడా ఓ వీడియో బైటపడింది.
 
మ‌నోరంజ‌న్ కంప్యూట‌ర్ సైన్స్‌లో డిగ్రీ ప‌ట్టా పుచ్చుకున్నాడు. నీలం సివిల్ స‌ర్వీసెస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. వీరు నలుగురే కాకుండా లలిత్‌ ఝాతో పాటు మరో వ్యక్తి ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. లలిత్‌ ఝాతో పాటు మరో వ్యక్తి పరారీలో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
ఎస్ఎఫ్ఐ కార్యకర్త మనోరంజన్
 
సాగర్ తో పాటు లోక్ సభ ఛాంబర్ లోకి ప్రవేశించిన మనోరంజన్ మైసూర్ కు చెందిన వ్యక్తిఅని, సిపిఎం అనుబంధ విద్యార్థి సంస్థ ఎస్ఎఫ్ఐ కు చెందిన వాడని అతని సోషల్ మీడియా పోస్ట్ లు స్పష్టం చేస్తున్నాయి. అతని తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. విజిటర్స్‌ పాస్‌ కోసం మనోరంజన్‌ మూడు నెలలుగా ఎంపీ ఆఫీసును సంప్రదిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అతనితో పాటు సభలో బెంచ్‌లపై నుంచి దూకుతూ స్పీకర్‌ చాంబర్‌ వైపు దూసుకెళ్లిన సాగర్‌ శర్మను మనోరంజన్‌ తన స్నేహితుడని చెప్పి, పాస్‌ తీసుకున్నట్లు గుర్తించారు.
కొత్త పార్లమెంటును చూడాలని ఉందంటూ ఎంపీ కార్యాలయ అధికారులకు చెప్పి, వీరు పాస్‌లు తీసుకున్నారు. బుధవారం సింహా తరఫున మొత్తం మూడు పాస్‌లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో మహిళకు పాస్‌ ఇచ్చినప్పటికీ.. ఆమె తన కుమార్తెతో కలిసి రావడం, చిన్నారి పేరు పాస్‌లో లేకపోవడంతో అనుమతించలేదని ఎంపీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
మనోరంజన్ తండ్రి దేవరాజ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు భద్రతను ఉల్లంఘించి చొరబడి తన కొడుకు తప్పు చేశాడని అంగీకరించాడు.
ఇక తన కొడుకు సమాజానికి తప్పు చేసినట్లైతే అతడిని ఉరితీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు ఏదైనా మంచి పని చేస్తే ప్రోత్సహిస్తానని.. కానీ ఇలా తప్పు చేస్తే మాత్రం ఖండిస్తానని దేవరాజ్ స్పష్టం చేశారు.
కాగా, గతవారం ఖలీస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ పార్లమెంట్‌ను పునాదులతో సహా కదలిస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే, ఈ బెదిరింపులను ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్టు లేదని తాజా ఘటనతో రుజువైందనే విమర్శ వినిపిస్తోంది. ఈ సందర్భంగా అరెస్ట్ అయినవారికి న్యాయసాయం కోసం రూ 10 లక్షల బహుమతి ప్రకటించాడు. “భారత ప్రజాస్వామ్య పునాదులను కదిలించిన వారికి న్యాయసాయం కోసం రూ 10 లక్షలు రివార్డ్” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
 
కేంద్రం అత్యున్నత దర్యాప్తు

పార్లమెంట్ సచివాలయం నుండి వచ్చిన కోర్కె మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై సి ఆర్ పి ఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్ నేతృత్వంలో ఒక అత్యున్నత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

2001లో పార్లమెంట్‌పై దాడి జరిగిన తర్వాత పాత పార్లమెంట్ భవనం వద్ద భధ్రతను ప్రక్షాళన చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థ స్థానంలో నాలుగు అంచెల భద్రతా వ్యవస్థ అమలులోకి వచ్చింది. పార్లమెంట్ వద్ద ఢిల్లీ పోలీసుకు చెందిన ప్రత్యేక విభాగంతోపాటు సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఒక కంటింజెంట్‌ను ఏర్పాటు చేశారు. 

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరీ ఫోర్స్, అగ్నిమాపక దళంతోసహా ఇతర సంస్థలను భద్రతా వ్యవస్థలో మమేకం చేశారు. భద్రతా ప్రక్రియలో భాగంగా పార్లమెంట్ వద్ద సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. భౌతిక తనిఖీలతో పాటు సందర్శకుల వద్ద ఉండే వస్తువులన్నిటినీ క్షుణ్ణంగా తనిఖీ జరుగుతుంది. 

ఫోన్లు, బ్యాగులు, నీళ్ల బాటిళ్లతోపాటు చిల్లర నాణేలను సైతం లోపలకు అనుమతించరు. సందర్శకులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను చూపించాల్సి ఉంటుంది. మూడు ఫుల్ బాడీ స్కానర్లను దాడుటకునే లోపలకు ప్రవేశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతే సందర్శకులకు పాసులు జారీ చేస్తారు.

సందర్శకుడి నేపథ్యాన్ని గురించి ఆరా తీసిన తర్వాత పాసుల జారీ జరుగుతుంది. పార్లమెంట్ సభ్యుడు సంతకం చేసిన సిఫార్సు లేఖలపైనే పాసులు జారీ చేస్తారు. పార్లమెంట్‌లోని విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించిన ఆ ఇద్దరు వ్యక్తులు స్మోక్ బాంబులను తమ షూ లోపల దాచి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వారిని తనిఖీ చేస్తున్న సమయంలో షూల విషయాన్ని భద్రతా సిబ్బంది విస్మరించి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఫుల్ బాడీ స్కానర్లను వారిద్దరూ ఎలా తప్పించుకుని ఉంటారన్నది మాత్రం అంతుచిక్కడం లేదు.