గాజాలో కాల్పుల విరమణకు అనుకూలంగా ఓటేసిన భారత్

తక్షణ మానవతావాద సాయం కోసం గాజాలో ఇజ్రాయెల్- హమాస్ కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఈ తీర్మానంలో పొందుపరిచారు. 
 
అల్జీరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, పాలస్తీనాతోపాటు అనేక దేశాలు స్పాన్సర్ చేసిన ఈ తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ సహా పది దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరో 23 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. 193 సభ్యులు కలిగిన జనరల్‌ అసెంబ్లీలో ఏ దేశానికి వీటో అధికారం లేదు.

ముసాయిదా తీర్మానంలో హమాస్‌ను ప్రస్తావించకపోవడంపై అమెరికా, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తప్పుబట్టాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హేయమైన ఉగ్రవాద దాడులను ఖండించాలని, బందీల విడుదలను పేర్కొంటూ తీర్మానానికి సవరణ చేయాలని డిమాండ్ చేశాయి. 

జనరల్ అసెంబ్లీ నుంచి వెలువడిన శక్తిమంతమైన సందేశం పరంగా ఇదొక చారిత్రాత్మకమైన రోజు అని ఐరాసలోని పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ వ్యాఖ్యానించారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తీవ్రమైన మానవతా సంక్షోభం ఏర్పడిందని, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతోందని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్  ఆందోళన వ్యక్తం చేశారు.

 స్త్రీలు, పిల్లల ప్రాణనష్టం అధికంగా ఉందని పేర్కొంటూ జనరల్ అసెంబ్లీ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసిందని తెలిపారు. ఈ తీర్మానంలో అనేక కోణాలు ఉన్నాయని, హమాస్ చెరలో బందీల పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందని రుచిరా కాంబోజ్ చెప్పారు.

కాగా, గాజాలో ఇజ్రాయిల్‌ దాడులను ఆపడం కోసం ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం భద్రతా మండలిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ గత  శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, మండలిలోని మొత్తం 15 సభ్య దేశాలకు గాను 13 దేశాలు దీనికి అనుకూలంగా ఓటు వేశాయి. 

బ్రిటన్‌ ఓటింగ్‌కు దూరంగా ఉంది. భద్రతామండలిలో అయిదు శాశ్వత సభ్యదేశాల్లో ఒకటైన అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగించి తీర్మానాన్ని అడ్డుకుంది. కాల్పుల విరమణతో హమాస్‌ మళ్లీ పుంజుకుంటుందని ఏమాత్రం పసలేని వాదనను అమెరికా ముందుకు తెచ్చింది.