కాశ్మీరీ శరణార్ధుల జీవితాలకు భరోసా ఈ బిల్లు

* కాంగ్రెస్‌ 5 చారిత్రక తప్పిదాలు

సర్వస్వం కోల్పోయి జన్మభూమి నుంచి వలస వచ్చిన కాశ్మీరీ శరణార్థుల జీవితాలకు భరోసా కల్పిస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన జమ్ము-కాశ్మీర్ రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి మద్దతు ప్రకటించారు. కాశ్మీర్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని మారణకాండను ఎదుర్కొని, అరాచకాలు, అకృత్యాలు, నిర్బంధాలపాలై సర్వసం కోల్పోయిన కాశ్మీరీ శరణార్ధుల జీవితాలకు ఈ బిల్లు భరోసా కల్పిస్తుందని తెలిపారు. 

తరతరాలుగా వారికి జరిగిన అన్యాయాలను ఈ బిల్లుల ద్వారా సరిదిద్దగల అవకాశం ఉందని చెప్పారు. 1389-1413 మధ్య కాలంలో కాశ్మీర్‌ను పరిపాలించిన పర్షియన్‌ రాజు సుల్తాన్‌ సికిందర్‌ హాయంలో తొలిసారిగా హిందువులు పెద్ద ఎత్తున వలస పోయారని గుర్తుచేశారు. హిందువుల పట్ల సికిందర్‌ సాగించిన దుర్మార్గాలు, దారుణాలు మాటలకు అందనివని చెప్పారు. 

అణచివేత, అకృత్యాలకు భయపడి జన్మభూమి నుంచి పారిపోయే క్రమంలో లక్ష మంది హిందువులు దాల్‌ సరస్సులో మునిగి దుర్మరణం పాలయ్యారని తెలిపారు. నిస్సహాయులైన మహిళలు మానభంగాలకు గురయ్యారని, హిందువులు మత మార్పిడికి అంగీకరించాలి లేదా దేశం విడిచి పారిపోవాలని హుకుం జారీ చేశారని పేర్కొన్నారు.

పారిపోలేని వారిని అక్కడికక్కడే హతమార్చారని విజయసాయి రెడ్డి వివరించారు. సికిందర్‌ సైనికులు దేవాలయాలు, హిందువుల పవిత్ర స్థలాలను సర్వనాశనం చేశారని, కిరాతకానికి లక్షలాది మంది బలైపోగా కేవలం 10 కాశ్మీరీ కుటుంబాలు మాత్రమే కాశ్మీర్‌ లోయ నుంచి ప్రాణాలతో బయటపడి వలస పోయాయని తెలిపారు.

తదనంతరం ఆరుసార్లు అణచివేతను తట్టుకోలేక కాశ్మీరి కుటుంబాలు వలస పోయాయని, వలసపోయిన కాశ్మీరీ హిందూ కుటుంబాలకు చెందిన భూములు పాలకుల అండదండలతో అన్యులపాలయ్యాయని పేర్కొన్నారు. జమ్మూ, కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేసే లక్ష్యంతో మొదలైన ఉగ్రవాదం రాజకీయ హింసకు అంకురార్పణ చేసిందని విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, పాక్‌ అక్రమిత కాశ్మీర్‌ భారత్‌ చేజారిపోవడానికి కాంగ్రెస్‌ 5 చారిత్రక తప్పులు చేసిందని విజయసాయి రెడ్డి విమర్శించారు. నెహ్రూ అవలంభించిన బూటకపు సెక్యులరిజమ్‌ కారణంగానే కాశ్మీర్‌ సమస్య అనేక దశాబ్దాలపాటు రావణకాష్టంలా రగులుతూ వచ్చిందని ఆరోపించారు. 50 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో జమ్మూ, కాశ్మీర్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు వచ్చిన అవకాశాలన్నింటినీ కాంగ్రెస్‌ పార్టీ జార విడిచిందని దుయ్యబట్టారు.

1947 జూలైలో కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తానని అప్పటి కాశ్మీర్‌ అధిపతి మహరాజా హరి సింగ్‌ చేసిన ప్రతిపాదనను ఆమోదించకుండా నెహ్రూ తటపటాయించారని, నెహ్రూ ఉదాశీనతను ఆసరాగా చేసుకుని తదనంతరం పాకిస్తాన్‌ కాశ్మీర్‌పై దాడికి తెగబడిందని ఆరోపించారు. ఇది కాంగ్రెస్‌ చేసిన మొట్టమొదటి చారిత్రక తప్పిదమని తెలిపారు. 

భారత సైన్యం శ్రీనగర్‌ను స్వాధీనం చేసుకుని పాకిస్తాన్‌ సైన్యాన్ని కాశ్మీర్‌లోని ఇతర భూభాగం నుంచి తిప్పికొడుతున్న తరుణంలో నెహ్రూ భారత సైన్యం ముందుకు పోకుండా నిలవరించారని చెబుతూ ఎవరిని రక్షించేందుకు, ఎవరి మెప్పు పొందేందుకు ఆయన ఆ పని చేశారో తెలియదని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

కాశ్మీర్‌ సమస్యను ఐక్యరాజ్య సమితికి తీసుకువెళ్ళడం నెహ్రూ చేసిన రెండవ తప్పిదమని దుయ్యబట్టారు. ఈ తప్పిదమే 1949లో రాజ్యాంగంలో ఆర్టికల్‌ 370 ప్రవేశపెట్టడానికి కారణమైందని తెలిపారు. ఆర్టికల్‌ 370 కారణంగా జమ్మూ, కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసే ప్రక్రియకు తీవ్ర అవరోధంగా నిలిచిందని స్పష్టం చేశారు. 

ఇక 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌ స్వాధీనం చేసుకునేందుకు మరో అవకాశం చిక్కిందని, ఆ యుద్ధంలో భారత సైన్యం లాహోర్‌ వరకు చొచ్చుకుపోగలిగినా పీవోకేను మాత్రం తిరిగి పొందలేక పోయిందని తెలిపారు.

అలాగే 1971 బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధం అనంతరం కూడా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి పాకిస్తాన్‌తో సంప్రదింపులు జరిపే అవకాశం దొరికిందని, కానీ సిమ్లా ఒప్పందంలో ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టడానికి పాకిస్తాన్‌ సిద్ధం అయినప్పటికీ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దానిని సద్వినియోగం చేసుకోలేకపోయిందని విమర్శించారు. 

చేతికి అందిన పీవోకేను కాంగ్రెస్‌ పార్టీ బంగారు పళ్ళెంలో పెట్టి పాకిస్తాన్‌కు అప్పగించిందని విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూ, కాశ్మీర్‌ విషయంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలను ఇప్పటి బీజేపీ ప్రభుత్వం సరిదిద్దే ప్రయత్నం చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన కొనియాడారు. 

మోడ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అనుసరించిన రెండు విధానాలు, ఇద్దరు ప్రధానులు, రెండు గుర్తులకు బదులుగా ఒకే విధానం, ఒకే ప్రధాని, ఒకే గుర్తు విధానం అమలులోకి వచ్చిందని ఆయన ప్రశంసించారు. ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూ, కాశ్మీర్‌లో గడచిన నాలుగేళ్ళలో గణనీయమైన మార్పులు సంభవించాయని, ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని ఆయన తెలిపారు.

శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని, జిల్లా అభివృద్ధి మండళ్ళ ద్వారా అధికార వికేంద్రీకరణ జరిగిందని చెప్పారు. ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజి కింద కొత్త ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టారు. టూరిజం, పెట్టుబడులు, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనంపై పెట్టిన దృష్టి వలన ఆర్థిక రంగం శక్తి పుంజుకుంటోందని విజయసాయి రెడ్డి వివరించారు.

ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీవోకే) ప్రాంతానికి కేటాయించిన 24 స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం లేదని, అందువల్ల పీవోకే పాలన చేతికి వచ్చే వరకు దానికి కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాలను నామినేషన్‌ ప్రాతిపదికపై భర్తీ చేయాలని సూచించారు. 

అలాగే కాశ్మీర్‌ నుంచి వలస వచ్చిన కాశ్మీరీ పండిట్ల కుటుంబాలకు నెలకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 13 వేల భత్యాన్ని రూ. 20 వేలకు పెంచాల్సిందిగా హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు.