సుఖ్‌దేవ్ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

రాజస్థాన్‌ లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ హత్య కేసులో ముగ్గురు కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ప్రధాన నిందితులను ఛండీగఢ్‌లో పట్టుకున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
 
హత్యా ఘటనతో ప్రమేయమున్న రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీ అనే ఇద్దరు షూటర్లను ఛండీగఢ్‌లో పట్టుకున్నారు. వీరితో పాటు మరో వ్యక్తి ఉద్ధమ్ సింగ్‌ను కూడా అదుపులోకిని తీసుకున్నారు. ముగ్గురినీ ఢిల్లీకి తరలించారు.  డిసెంబర్ 5వ తేదీన సుఖ్‌దేవ్ సింగ్ నివాసంలో ఆయనపై నితిన్ ఫౌజీ, రోహిత్ రాథోడ్‌లు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
వీరికి సహకరించిన రామ్‌వీర్ సింగ్‌ అనే వ్యక్తిని జైపూర్‌లో అరెస్టు చేసిన దరిమిలా నితిన్, రోహిత్‌ల అరెస్టులు చోటుచేసుకున్నట్టు జైపూర్ పోలీస్ కమిషనర్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. గోగామేడి హత్యకు సంబంధించిన దృశ్యాలు ఆయన ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యారు.
 
దుండగుల్లో ఒకడైన నవీన్ షెకవత్ సహచరుల కాల్పుల్లో మరణించాడు. గోగామేడి బాడీగార్డ్ కూడా కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. సుఖ్‌దేవ్ హత్యకు తమదే బాధ్యత అని లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు అనుబంధంగా పనిచేసే రోహిత్ గోదారా గ్యాంగ్ ప్రకటించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల ఆచూకీ చెప్పిన వారికి రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకుంది.