ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్‌ను బిజెపి అధిష్టానం ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి ఏంపిక కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఆదివారం ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత నిర్ణయం తీసుకుంది. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలు బీజేపే శాసనసభాపక్షనేతగా విష్ణుదేవ్ సాయ్‌ను ఎన్నుకున్నారు. విష్ణుదేవ్‌ సాయ్ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు. 
అంతకుముందు బీజేపీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేలు‌ రాయ్‍పూర్‌లో సమావేశమయ్యారు. వీరితో కేంద్రమంత్రులు అర్జున్ ముండా, సర్భానంద సోనోవాల్, పార్టీ జనరల్ సెక్రటరీ దుష్యంత్ కుమార్ గౌతమ్, ఛత్తీస్‌గడ్ బీజేపీ ఇంఛార్జ్ ఓమ్ మాథూర్, మరో కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ భేటీ అయ్యారు.
ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుదేవ్ సాయ్‌ను ఎన్నుకున్నారు. 59 ఏళ్ల విష్ణుదేవ్ సాయ్ ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లోని కున్‌కురీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేయగా ఇందులో విష్ణుదేవ్ సాయ్ కీలకపాత్ర పోషించారు. 
ఛత్తీస్‌గఢ్‌ కొత్త ముఖ్యమంత్రి అయిన సందర్భంగా విష్ణు దేవ్‌సాయి మాట్లాడుతూ  ‘నేను పూర్తి నిజాయితీతో సబ్‌కా విశ్వాస్‌’ కోసం పని చేస్తానని, ‘మోదీ కీ గ్యారెంటీ’ కింద ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తానని చెప్పారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాం.. ప్రజలకు 18 లక్షల ఆవాస్‌ అందించడమే మొదటి పని అని తెలిపారు. ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉంటారని మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తెలిపారు.
 
విష్ణుదేవ్ సాయ్‌.. సాహు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్ పూర్ డివిజన్లలో ఈవర్గం జనాభా అధికంగా ఉంది. మరోవైపు విష్ణుదేవ్ సాయ్ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. రాయ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి 1999 నుంచి 2014 వరకూ నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయనకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు మూడుసార్లు ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు.
ఐదురాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఇటీవల ఛత్తీస్‌గఢ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. 90 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 54 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 2018లో 68 సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి 35 సీట్లకు పరిమితమైంది. గోండ్వానా గణతంత్ర పార్టీకి ఒక సీటు వచ్చింది. 
2018 ఎన్నికల్లో గిరిజనులు అధికంగా ఉన్న సర్‌గుజా డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది. ఈ డివిజన్‌లో ఉన్న 14 స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. అయితే 2023 ఎన్నికల్లో విష్ణుదేవ్ సాయ్ ప్రభావంతో ఈసారి హస్తం పార్టీకి చుక్కెదురైంది. ఈ డివిజన్‌లో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ జనాభాలో ఎస్టీల వాటా 32 శాతం కాగా బీజేపీ 29 సీట్లు కేటాయించింది. వాటిలో 17చోట్ల గెలుపొందింది.