తమిళనాడులో మిగ్జాం తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలకు నష్టం వచ్చిన ప్రాంతాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ఏరియల్ సర్వే నిర్వహించారు. మిగ్ జాం తుపాన్ వల్ల భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన చెందారని, తమిళనాడులో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాలని తనను ఆదేశించారని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్తో ప్రధాని ఫోన్లో మాట్లాడారని ఆయన చెప్పారు. చెన్నైలో వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యకలాపాల కోసం కేంద్రం రూ.500 కోట్లను ఆమోదించిందని, రెండో విడత కింద రూ.450 కోట్లు విడుదల చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖను ప్రధాని ఆదేశించారని చెప్పారు.
ఏరియల్ సర్వే తరువాత సచివాలయంలో తమిళనాడు సీఎం స్టాలిన్తో రాజ్నాధ్ సింగ్ సమావేశమయ్యారు. వానలు, వరదలతో దెబ్బతిన్న చెన్నైతోపాటు పరిసర ప్రాంతాల్లో పరిస్థితి, ఈ విపత్తు వల్ల సంభవించిన నష్టం, కేంద్రం నుంచి సాయం తదితర అంశాలపై చర్చించారు. రాజ్నాథ్ సింగ్ వెంట కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ కూడా ఉన్నారు.
చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువల్లూరు జిల్లాల్లో తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని, తక్షణ సాయంగా రూ. 5060 కోట్లు ఇవ్వాలని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఏపీ, తమిళనాడులకు కేంద్ర సహాయం
ఇలా ఉండగా, మిగ్జాం తుఫాన్ కారణంగా భారీగా నష్టాలకు గురైన తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లకు ఎస్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేయాలని కేంద్ర హోంశాఖను ప్రధాని మోదీ ఆదేశించినట్లు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తన ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో ఏపీకి రూ. 493 కోట్లు, తమిళనాడుకు రూ. 450 కోట్లు విడుదల చేయనున్నట్లు ఆయన తన ట్వీట్లో చెప్పారు.
కాగా, రెండు రాష్ట్రాలకే ఇప్పటికే తొలి దఫాగా నిధులు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. తుపాను వల్ల తమిళనాడులో సంభవించిన వరద పరిస్థితులను అధిగమించేందుకు రూ. 561 కోట్ల నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెన్నైలో వరదల నివారణకు అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కింద విడుదల చేసే నిధుల్లో ఇవి తొలి భాగమని అమిత్ షా తెలిపారు.
‘చెన్నై పెద్ద వరదలను ఎదుర్కొంటోంది. గత ఎనిమిదేళ్లలో సంభవించిన వరదల్లో తాజాది మూడవది. మెట్రోపాలిటన్ నగరాల్లో అధిక వర్షపాతం నమోదుకావడం, ఆకస్మిక వరదలకు దారితీయడం వంటివి మనం చూస్తున్నాం. జాతీయ విపత్తు నివారణ నిధి నుంచి ‘ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఫర్ చెన్నై బేసిన్ ప్రాజెక్ట్’ కోసం రూ.561.29 కోట్ల మొదటి దశ వరద ఉపశమన నిధులకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. ఇందులో కేంద్ర సాయం రూ. 500 కోట్లు’ అని ఎక్స్లో పేర్కొన్నారు.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్