సురక్షిత నగరంగా కోల్‌కతా, మూడో స్థానంలో హైదరాబాద్

భారత్‌లో అత్యంత సురక్షితమైన నగరంగా కోల్‌కతా నిలిచింది. వరుసగా మూడోసారి ఆ నగరం సేఫెస్ట్ సిటీగా నిలవడం గమనార్హం. జాతీయ నేరగణాంకాల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ఈ విషయాన్ని తెలియజేసింది. లక్ష జనాభాలో జరుగుతున్న నేరాల ఆధారంగా ఎన్‌సిఆర్‌బి విడుదల చేసిన  ‘‘క్రైమ్ ఇన్ ఇండియా 2022 ’’ నివేదిక వెల్లడి చేసింది. ఈ జాబితాలో పుణే, హైదరాబాద్‌ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

 2022లో కోల్‌కతాలో ప్రతి లక్ష జనాభాలో నమోదయిన కేసుల సంఖ్య 86.5 గా ఉంది. ఇక పుణెలో 280.2, హైదరాబాద్‌లో 299.2గా ఉన్నట్లు ఎన్‌సిఆర్‌బి డేటా పేర్కొంది. ఐపిసి, స్పెషల్, లోకల్ లాస్( ఎస్‌ఎల్ ఎల్) కింద నమోదయిన కేసులనే క్రైంగా గుర్తిస్తారు. 

ఇక 2021లో కోల్‌కతాలో ప్రతి లక్ష జనాభాకు 103.4 కేసులు నమోదయ్యాయి. 2022లో ఆ సంఖ్య 86.5కు పడిపోయింది. 2020లో ఈ సంఖ్య 129.5గా ఉంది. 2021లో పుణెలో ప్రతి లక్ష జనాభాకు 256.8 కేసులు, హైదరాబాద్‌లో 259.9 కేసులు నమోదయ్యాయి. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 నగరాలను పోల్చి చూసిన తర్వాత ఈ ర్యాంకులను విడుదల చేశారు. 

అయితే 2021తో పోలిస్తే కోల్‌కతాలో మహిళలపై నేరాల సంఖ్య పెరిగింది. 2021లో మహిళలపై నేరాల సంఖ్య 1783గా ఉండగా, 2022లో ఆ సంఖ్య 1,890కి చేరింది.