లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణాలో 17 స్థానాలు గెల్చుకుంటాం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి మాత్రమే ఓటింగ్ శాతం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దాదాపు 14 శాతం ఓటు బ్యాంకును కైవసం చేసుకున్నట్లు చెబుతూ గత ఎన్నికలతో పోలిస్తే తమ ఓటు బ్యాంక్ 100 శాతం పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అంచనాల కంటే ఎక్కువగా 8 స్థానాల్లో విజయం సాధించినట్లు చెప్పారు.

ఈ బలంతో వచ్చే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 స్థానాలను గెలుచుకుంటామని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము చేసిన పోరాటాలు కాంగ్రె్‌సకు ప్రయోజనం చేకూర్చాయని తెలిపారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం, తమపై బురద జల్లడం, ఇతర కారణాల వల్ల ఓడిపోయామని.. మిగతా కారణాలపై కూడా సమీక్ష చేసుకుంటామని చెప్పారు.

ప్రస్తుతం సాధించిన ఓట్లను మరింత పెంచుకుని పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతామని పేర్కొన్నారు. ఈ ప్రజాదరణతో పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేస్తామని భరోసా వ్యక్తం చేశారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తామో తెలియదు కానీ పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓటు వేస్తామని మేం ప్రచారానికి వెళ్లినప్పుడు అనేక మంది బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మద్దతుదారులు చెప్పారు. ఇందుకు అనుగుణంగా త్వరలోనే సమీక్షలు చేపడతాం’ అని కిషన్ రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పంపిణీ చేసిందని ఆయన ఆరోపించారు. రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజారిటీ ఇవ్వలేదని గుర్తు చేశారు.  కాంగ్రెస్‌ ప్రకటించిన గ్యారెంటీలను అమలు చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తామని చెప్పారు

కామారెడ్డిలో ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు. కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఐదేళ్ల పోరాటమే ఈ ఫలితాన్ని ఇచ్చిందని చెబుతూ కామారెడ్డి ఫలితం పట్ల జాతీయ నాయకత్వం హర్షం వ్యక్తం చేసిందని తెలిపారు. 2024 కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోదీ హ్యాట్రిక్ సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

నిరాశను దరి చేరనీయకుండా పట్టుదలతో తమ లక్ష్యం కోసం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బిజెపి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించి వచ్చే ఐదేళ్లు క్రియాశీల, నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తామని చెప్పారు. ఈటల రాజేందర్‌ ఓడిపోయినా ఆయనతో పాటు ప్రతి ఒక్కరి సేవలను వినియోగించుకుంటామని చెప్పారు.

నిత్యం ప్రధానిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన వాళ్లు ఇప్పుడు ఫాంహౌ్‌సకు వెళ్లిపోయారని మాజీ సీఎం కేసీఆర్‌నుద్దేశించి ఎద్దేవా చేశారు.  ఢిల్లీకి వెళ్లి అదిష్టానానికి అన్ని విషయాలు వివరిస్తామని చెబుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయించేవని, పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రతి ఒక్కరి సహాయం తీసుకుంటామని వివరించారు.