తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసింది

ప్రస్తుత ఎన్నికల్లో పరాజయం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పతనానికి ప్రారంభం అని పేర్కొంటూ తెలంగాణలో బీఆర్ఎస్ శకం ఇక ముగిసిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. దానితో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ – బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.  తెలంగాణ రాష్ట్రంలో ఏడాది క్రితం వరకు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నభావన ప్రజల్లో ఉందని, కానీ ప్రజల్లో ఆ నమ్మకాన్ని కొనసాగించలేకపోవడం వల్లనే ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని ఆయన చెప్పారు.
 
బీజేపీ ఓటమికి కారణాలను విశ్లేషిస్తూ .. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ చేసిన ఆరోపణలను ప్రజలు నిజమేనని భావించారని, ఆ క్రమంలో కేసీఆర్‌ను ఓడించడానికి కాంగ్రెస్ వైపు మొగ్గచూపారని తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు సైతం ఈ పరిస్థితికి దోహదం చేసిందని అరవింద్  అభిప్రాయపడ్డారు.
 కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచి కొన్ని స్థానాల్లో గెలుపొందిందని ఆయన ఆరోపించారు. తన పొరుగున ఉన్న బాల్కొండలో ఒక్క రోజులో రూ. 34 కోట్లు పంచారని చెబుతూ  దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అసెంబ్లీ ఎన్నికలుగా రికార్డుకెక్కుతాయని ధ్వజమెత్తారు.
 
తాను కోరుట్లలో డబ్బు పంచకుండా ఎన్నికల్లో పోటీ చేసి ఒక ప్రయోగం చేశానని పేర్కొంటూ ఆ ప్రయత్నంలో ఓడిపోయినా సరే అన్ని ఓట్లు ఇవ్వడం అంటే కోరుట్ల ప్రజల విజయంగానే భావిస్తున్నానని తెలిపారు. త్వరలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మేల్యేలు జారుకుంటారని, ప్రజల్లో ఆ పార్టీపై అభిమానం పోయిందని తెలిపారు.
 
మనిషికి సహజ మరణం ఉన్నట్టే ఆ పార్టీ పతనమైపోతుందని అరవింద్ జోస్యం చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రతిపక్ష నేతగా కూడా రావొద్దని తాను కోరుకుంటున్నానని చెప్పారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయిందని, ఆ స్థితి నుంచి పార్టీని అధికారంలోకి తేవడంలో పోరాటపటిమ ప్రదర్శించిన రేవంత్‌కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. 
ఇక నుంచి తెలంగాణలో హుందాతనంతో కూడిన రాజకీయాలు ఉంటాయని ఆశిస్తున్నానని అరవింద్ తెలిపారు. అలాగే వ్యక్తిగత దూషణ, ఇళ్లపైకి రాళ్లతో దాడులు వంటి  వాటికి ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేతలు ఉపయోగించే భాష కూడా మారుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.