ఆసుపత్రిలో వెంటిలేటర్ పై పాక్ ఉగ్రవాది ఐఎస్ఐ కుట్రేనా?

పాకిస్తాన్ లో లష్కరే తోయిబా సహా పలు ఉగ్ర సంస్థల కీలక నేతల మరణాలు ఒకవంక మిస్టరీగా మిగిలిపోతుండగా, తాజాగా, మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సాజిద్ మీర్ మరణం అంచుల్లో కొట్టుమిట్టాడుతుండటం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్తాన్ లో జైళ్లో ఉన్న ఆయనపై విష ప్రయోగం జరిగిందని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నాడని చెబుతున్నారు.
అయితే, కేవలం అతనిని తమకు అప్పచెప్పమని కోరుతున్న అమెరికా దృష్టి మళ్లించడం కోసం ఐఎస్ఐ కుట్రలో భాగంగా ఈ నాటకం ఆడుతున్నారా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. అవసరమైతే, సాజిద్ మీర్ చనిపోయాడని కూడా ప్రకటించే అవకాశముందని, తద్వారా అతడిపై అమెరికా సహ అంతర్జాతీయ సమాజం చర్యలను అడ్డుకోవచ్చని చూస్తున్నారని పలువురు భావిస్తున్నారు.

సాజిద్ మీర్ లష్కరే  తోయిబా ఉగ్ర సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తించేవాడు. ముంబైపై జరిగిన 26/11 ఉగ్ర దాడుల ప్రధాన సూత్రధారుల్లో సాజిద్ మిర్ కూడా ఒకడు. ఆ దాడుల సందర్భంగా దాడులు చేసేవారిని రిక్రూట్ చేయడం నుంచి వారికి ముంబైలో అవసరమైన సమాచారం అందించేవరకు సాజిద్ మీర్ కీలకంగా వ్యవహరించాడు. 

భారత్ లో జరిగిన పలు ఇతర ఉగ్రదాడుల వెనుక కూడా సాజిద్ మీర్ ఉన్నాడు. సాజిద్ మీర్ ప్రస్తుతం పాకిస్తాన్ లోని కోట్ లక్పత్ జైళ్లో ఉన్నాడు. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం చేసిన నేరంపై అతడికి స్థానిక ఉగ్రవాద వ్యతిరేక కోర్టు గత సంవత్సరం 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పాక్ కు ఆర్థిక సాయం, రుణాలు అందించడానికి ఆ దేశంలోని ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలన్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిబంధనల మేరకు పాక్ సాజిద్ మీర్ ను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టింది.

26/11 దాడులలో సాజిద్ మీర్ పాత్రను నిర్ధారించిన అమెరికా ప్రభుత్వం అతడి వివరాలు తెలిపిన వారికి 5 మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించింది. మీర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించి, అతని ఆస్తులను స్తంభింపజేయాలని, ప్రయాణ నిషేధాన్ని విధించాలని అమెరికా, భారత్ చేసిన ప్రతిపాదనను గతంలో ఐరాస ఆమోదించింది.