పాక్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది రోడే మృతి

జర్నైల్‌ సింగ్‌ భింద్రన్‌వాలే మేనల్లుడు, ఖలిస్థాన్‌ ఉగ్రవాది లఖ్‌బీర్‌ సింగ్‌ రోడే డిసెంబర్‌ 2న పాకిస్థాన్‌లో మరణించారు. లఖ్‌బీర్‌ గుండెపోటుతో మరణించినట్లు నిఘా వర్గాలు మంగళవారం తెలిపాయి. భిద్రన్‌వాలే మరణించిన అనంతరం లఖ్‌బీర్‌ సింగ్‌ పాకిస్థాన్‌ పారిపోయాడు.  నిషేధిత సంస్థ ఖలిస్తాన్‌ జిందాబాద్‌ ఫోర్స్‌ అధ్యక్షుడు అయిన లఖ్‌బీర్‌ సింగ్‌ భారత్‌లో తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గనడంతో భారత ప్రభుత్వం అతనిని గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. 

లఖ్‌బీర్‌  మరణాన్ని భారత్‌లో ఉంటున్న అతడి సోదరుడు జస్‌బీర్‌ సింగ్‌ ధ్రువీకరించాడు.  కెనడాలో ఉంటున్న లఖ్‌బీర్‌ కుమారుడి నుండి తనకు ఈ సమాచారం అందిందని పేర్కొన్నాడు.  పాక్‌లోనే అతడి అంత్యక్రియలను సిక్కు ఆచార సంప్రదాయాలను అనుసరించి రహస్యంగా  పూర్తిచేసినట్లు వెల్లడించాడు. లఖ్‌బీర్‌ సింగ్‌ పంజాబ్‌కు డ్రగ్స్‌, ఆయుధాలు, పేలుడు పదార్థాలు పంపుతున్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలోని పలువురు ప్రముఖ వ్యక్తులను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నాయి. 20 కేజీల ఆర్‌డిఎక్స్‌ పేలుడు పదార్థాలను కలిగి ఉన్న లఖ్‌భీర్‌ను నేపాల్‌లో అరెస్ట్‌ చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అక్టోబర్‌లో పంజబాబ్‌లోని మోగాలో లఖ్‌బీర్‌ ఆస్తులను జప్తు చేసింది.  2021 నుండి 2023 మధ్య ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొగన్నందుకు లఖ్‌బీర్‌పై ఆరు ఉగ్రవాద కేసులకు సంబంధించి ఈ దాడులు జరిపినట్లు ఎన్‌ఐఎ వెల్లడించింది. కాగా, ఈ ఏడాది మేలో ఖలిస్థానీ కమాండో ఫోర్స్‌ అధినేత పరంజీత్‌ సింగ్‌ పన్వార్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు లాహోర్‌లో కాల్చిచంపారు.