హిమాలయ పర్వతాలకు పెనుముప్పు

హిమనదాలు ప్రమాదస్థాయిలో కరిగిపోతుండడంతో హిమాలయ పర్వతాలకు పెనుముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న వార్షిక వాతావరణ చర్చలు కాప్ 28లో అభివృద్ధి చెందుతున్న దేశాలు ముఖ్యంగా పర్వత దేశాల తక్షణ అవసరాలకు స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

“పర్వతాలు సహాయం కోసం కేకలు వేస్తున్నాయి, కాప్-28 ప్రతిస్పందించాలి.” అని ఆయన పేర్కొన్నారు. హిమాలయాలు పూర్తిగా అదృశ్యం కావచ్చని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.నేపాల్ ప్రధాన మంత్రి ప్రచండ, ఇతర దేశాధినేతలు, ప్రతినిధులతో శనివారం ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న గుటెర్రెస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

హిమాలయాల్లోని హిమనదాలు, అక్కడ పుట్టే సింధూనది, గంగ, బ్రహ్మపుత్ర లాంటి పది ప్రధాన నదులపై దాదాపు 24 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. ఈ నదీ ప్రరీవాహక ప్రాంతంలోని భారత్ సహా ఎనిమిది దేశాల్లోని మరో వంద కోట్ల మంది హిమనదాల్లో పుట్టి ప్రవహించే నదులపై ఆధారపడి జీవిస్తున్నారు. 

దుబాయిలో జరుగుతున్న వాతావరణ సదస్సు( కాప్28)లో భాగంగా శనివారం పర్వతప్రాంత దేశాల సమావేశంలో గుటెరస్ మాట్లాడుతూ నేపాల్‌లోని పర్వతాల్లోని మంచులో మూడో వంతు కేవలం 30 సంవత్సరాల వ్యవధిలో కరిగిపోయిందని, భూగోళం వేడెక్కడానికి కారణమైన కర్బన ఉద్గారాలే దీనికి ప్రధాన కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇది గ్రీన్‌హౌస్ వాయువు కాలుష్యంతో ముడిపడి ఉందని, దీంతో భూమి వేడి పెరుగుతుందని తెలిపారు. పంథాలో మార్పు రాకపోతే విపత్తు తప్పదని ఆయన స్పష్టం చేశారు. వెనుకబడిన దేశాలకు అందజేస్తామని ఇచ్చిన 100 బిలియన్ డాలర్ల సహాయంపై స్పష్టత ఇవ్వాలని, అలాగే దత్తత ప్రణాళిక ఆర్థిక సాయాన్ని 2025 నాటికి 40 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలని అభివృద్ధి చెందిన దేశాలకు గుటెరస్ విజ్ఞప్తి చేశారు.

అయితే జరుగుతున్న నష్టం తీవ్రతతో పోలిస్తే ఈ మొత్తాలు చాలా తక్కువ అని గుటెరస్ అంటూ నేపాల్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను మరింత మెరుగ్గా తీర్చడానికి వీలుగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను, అంతర్జాతీయ అభివృద్ధి బ్యాంకులను సంస్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఈ మార్పు రాని పక్షంలో పెను ప్రమాదం ముంచుకు రానుందని ఆయన హెచ్చరించారు. గత అక్టోబర్ చివరి వారంలో గుటెరస్ ఎవరెస్టు ప్రాంతంతో పాటుగా నేపాల్‌లో పర్యటించి అక్డి పరిస్థితలును స్వయంగా అర్థం చేసుకున్నారు.