1.40 లక్షల మంది భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు

గతేడాది భారతీయ విద్యార్థులకు అత్యధిక వీసాలు జారీ చేసిన దేశంగా అమెరికా నిలిచింది. 2022 భారతీయ విద్యార్థులకు 1,40,000 వీసాలు జారీ చేసింది. దీనికి తోడు వీసా అపాయింట్మెంట్ వెయిటింగ్ సమయాన్ని  తగ్గించడానికి యూఎస్ చర్యలు తీసుకుంటోంది. భారత్ తో దౌత్యపర సంబంధాలు పెంపొందించుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ చేస్తున్న కృషిలో భాగంగా వీసాల జారీలో భారత్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. 
వీసా సేవలకు సంబంధించి యూఎస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జూలీ స్టఫ్ట్ మాట్లాడుతూ భారత్‌లోని అమెరికా వీసా మిషన్లు వారానికి ఆరు, ఏడు రోజులు పనిచేశాయని చెప్పారు.  విద్యార్థులు తరగతులు ప్రారంభమయ్యే ముందు ఇంటర్వ్యూలు జరిగేలా చూశాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది సైతం భారత్ నుంచి వస్తున్న డిమాండ్ ఆధారంగా వీసాల జారీ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.
“గతేడాది రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను. తొలిసారిగా మిలియన్ వీసాలు జారీ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం” అని తెలిపారు. గతేడాదిలా పరిస్థితి కొనసాగితే ఈజీగా లక్ష్యాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.  “భారత్ లో దరఖాస్తు చేసుకున్న కార్మికులు, సిబ్బంది, విద్యార్థులు అమెరికా రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయులను మేం ప్రత్యేకంగా చూస్తాం. ప్రస్తుతం అమెరికా వీసాలు అత్యధికంగా పొందిన దేశంగా భారత్ నిలిచింది” అని చెప్పారు. 
 
విద్యార్థులకు కొన్ని సార్లు ఇంటర్వ్యూలు జరపకుండానే వీసాలు జారీ చేశామని ఆయన వెల్లడించారు. దానికితోడు ఇరు దేశాల మధ్య దౌత్యపర సంబంధాలు పెంపొందించుకోవడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అమెరికా రావాలని ఆసక్తి ఉన్న వారెవరైనా వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. భారతీయ విద్యార్థులకు ఉన్న నైపుణ్యాలు అమెరికా అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయి. 2023లో ఇప్పటివరకు10.5 మిలియన్ల మందికి పైగా వీసాలను జారీ చేసింది. ఇది తాను ఊహించిన దానికంటే 2 మిలియన్లు ఎక్కువని జూలీ తెలిపారు.
అమెరికాలోనే హెచ్‌1బీ రెన్యువల్‌!
వీసా గడువు ముగిసిన విదేశీయులు రెన్యువల్‌ కోసం మళ్లీ స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమెరికాలోనే రెన్యువల్‌ చేసే పైలట్‌ ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఆ దేశ వీసా సర్వీస్‌ డిఫ్యూటీ అసిస్టెంట్‌ సెక్రెటరీ జులీ స్టఫ్‌ తెలిపారు. హెచ్‌ 1బీ వీసాదారులకు ఈ సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు. 
మొదటి దఫాలో 20 వేల వీసాలను రెన్యువల్‌ చేయనున్నట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంతో అత్యధికంగా భారతీయులే లాభపడనున్నారు. అమెరికా వర్క్‌ వీసా గడువు ముగిసిన తర్వాత రెన్యువల్‌ చేయించుకోవాలంటే ఇప్పటివరకు స్వదేశానికి వెళ్లాల్సి వచ్చేది. ప్రయాణ సమయం, ఖర్చులను దృష్టిలోపెట్టుకొని వీసాదారుల కష్టాలను తొలగించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు జులీ పేర్కొన్నారు.