డ్వాక్రా బృందాలకు డ్రోన్లు.. రూ 8 లక్షల చొప్పున సాయం

ప్రతి మహిళా స్వయం సహాయక సంఘం (డ్వాక్)రా బృందానికి డ్రోన్ల కొనుగోళ్ల కోసం రూ 8 లక్షల చొప్పున అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. దేశంలోని స్వయం సహాయక బృందాలు (ఎస్‌జిహెచ్) ఈ సాయంతో డ్రోన్లను సంతరించుకుంటాయి.  డ్రోన్ల వినియోగం, వాటి ద్వారా క్రిమిసంహారక మందులు చల్లడం, పొలాలకు బలవర్థకాలు చేరేలా చేయడం వంటి వాటిపై గ్రూప్‌ల వారిగా నిపుణులతో శిక్షణలు ఇప్పిస్తారు.
రెండేళ్ల కాలానికి ఈ డ్రోన్ల పంపిణీకి అయ్యే వ్యయం రూ 1,261 కోట్లు అవుతుందని అంచనా వేశారు.  ప్రతి బృందానికి ఓ డ్రోను అందిస్తారు. దీనికోసం ప్రతి బృందం రూ 8 లక్షల మేర సాయం పొందేలా ఏర్పాట్లు చేస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం నిర్ణీత 15,000 ఎస్‌హెచ్‌జిలకు డ్రోన్లను 2024 -2025 తరువాత 2025 -26 ఆర్థిక సంవత్సరాలకు వర్తించేలా ఈ ఆర్థిక సాయం అందుతుంది. 

గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులకు ఈ బృందాలు అద్దె ప్రాతిపదికన ఈ డ్రోన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థికంగా లాభం పొందేందుకు వీలేర్పడుతుంది. ప్రతి డ్రోనుకు దాదాపు రూ 10 లక్షల ఖర్చు అవుతుంది. ఇందులో 80 శాతం వరకూ కేంద్రం డ్వాక్రా బృందాలకు ఆర్థిక సాయం చేస్తుంది.

కాగా, గిరిజన తెగల ప్రజలకు పక్కా ఇండ్లు, పైపుల ద్వారా నీటి సరఫరా, రోడ్డు సౌకర్యం తదితర 11 రకాల వసతుల కల్పన కోసం ప్రధాన మంత్రి జన్‌జటి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (పీఎం-జన్‌మన్‌) అమలుకు ఆమోదం తెలిపింది.

 
లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయాన్ని అందించాలన్న లక్ష్యంతో ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టులను మరో మూడేండ్లు కొనసాగించేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకయ్యే మొత్తం రూ1,952.23 కోట్లలో నిర్భయ నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం రూ.1,207.24 కోట్లు సమకూరుస్తుందని, మిగిలిన రూ.744.99 కోట్లను రాష్ర్టాలు భరించాల్సి ఉంటుందన్నారు.