బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా భారత జట్టుకు తొలిసారి కెప్టెన్గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా శుభారంభం అందుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
జోస్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్వితీయ సెంచరీతో కదంతొక్కగా, స్టీవ్ స్మిత్ (41 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. ముఖేశ్ కుమార్ (0/29) పొదుపుగా బౌలింగ్ చేయగా, తక్కిన వాళ్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. సమన్వయ లోపంతో రుతురాజ్ గైక్వాడ్ (0) ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే వెనుదిరగగా, యశస్వి జైస్వాల్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు.
తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (12; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలువలేకపోగా, ఆఖర్లో తీవ్ర ఒత్తిడిని అధిగమించి రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మిగిలిన పని పూర్తిచేశాడు. ఆసీస్ బౌలర్లలో తన్వీర్ సంఘా రెండు వికెట్లు పడగొట్టగా, ముగ్గురు భారత బ్యాటర్లు రనౌట్ అయ్యారు. సూర్యకుమార్ యాదవ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం తిరువనంతపురంలో రెండో టీ20 జరగనుంది.
More Stories
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం
రేవణ్ణ విదేశీ పర్యటనలో ప్రభుత్వ సంబంధం లేదు