ప్రధాని మోదీపై వాఖ్యలకై రాహుల్ కు ఈసీ నోటీసు

రాజస్తాన్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసే వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి షాకిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదుపై స్పందించింది.  ప్రధాని మోదీని ఉద్దేశించి ‘పనౌటి’, ‘పిక్‌ పాకెట్‌’ వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ రాహుల్ కు నోటీసులు పంపింది. 
 
ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు ప్రధాని మోదీ వెళ్లడంపై రాహుల్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. రాజస్థాన్ లో తాజాగా ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ లో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో కుర్రాళ్లు బాగా ఆడుతున్నారని, అదే సమయంలో అక్కడికి ఓ పనౌతీ (దుష్టశక్తి) వచ్చిందని పేర్కొన్నారు.  అంతే భారత్ ఓటమి పాలైందని రాహుల్ వ్యాఖ్యానించారు.

‘మన కుర్రాళ్లు అద్భుతంగా ప్రపంచకప్‌ను దాదాపు గెలిచారు కానీ ఓటమిపాలయ్యారు. అయితే, అక్కడికి వచ్చిన ఓ అపశకునం వల్లే ఓడిపోయారంటూ ప్రధానిని ఉద్దేశించి రాహుల్‌ వ్యాఖ్యనించారు. అలాగే, జేబుదొంగల కథను చెప్పారు. ముగ్గురు వ్యక్తులు పిక్‌ పాకెట్‌ కోసం వస్తారు. ఓ జేబుదొంగ దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తాడు. రెండోవాడు వెనుక నుంచి జేబును కత్తిరిస్తాడు. మూడోవాడు చూస్తూ ఉండి దాడికి సిద్ధంగా ఉంటాడు’ అని వ్యాఖ్యానించారు.

‘జేబు దొంగల దృష్టి మళ్లించే వ్యక్తి ప్రధాని మోదీ అని.. జేబులు కొట్టేవాడు అదానీ అని.. మూడో జేబుదొంగ అమిత్‌ షా’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. నైతిక ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నందున వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల చట్టాలు, మోడల్ ప్రవర్తనా నియమావళికి సంబంధించిన మార్గదర్శకాలతోపాటు విలువలకు గౌరవం లేదని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీని ఆశ్రయించారు. ప్రధాని మోదీపై చేసిన పనౌతీ వ్యాఖ్యకు వివరణ ఇచ్చేందుకు శనివారం వరకూ రాహుల్ కు ఈసీ గడువు ఇచ్చింది.

శనివారమే రాజస్తాన్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో తన ప్రచారంలో రాహుల్ గాంధీ ఇతర అవమానకరమైన పదాలను ఉపయోగించారని, ధృవీకరించని ఆరోపణలు చేశారని బీజేపీ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఒక సీనియర్‌ నాయకుడికి ఇలాంటి పదజాలం తగదని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో ఈసీ రాజకీయ ప్రత్యర్థులపై నిర్ధారణ కాని ఆరోపణలు చేయడాన్ని ఎన్నికల నియమావళి నిషేధించిందని రాహుల్ కు జారీ చేసిన నోటీసులో ఎన్నికల కమిషన్ పేర్కొంది. కాబట్టి దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశించింది. ఈసీ నోటీసులకు రాహుల్ ఎలా స్పందిస్తారో శనివారం తేలనుంది.