శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు, ప్రముఖ విట్రియోరెటినల్ సర్జన్ ఎస్ఎస్ బద్రీనాథ్ (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బద్రీనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ విషయాన్ని తమిళనాడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రామ సుగంథన్ ధ్రువీకరించారు.
కాగా వైద్య రంగంలో ఆయన చేసిన కృషికిగానూ 1996లో భారత ప్రభుత్వం బద్రీనాథ్ను పద్మభూషన్ అవార్డుతో సత్కరించింది. దేశంలోనే అత్యుతమ కంటి వైద్యులుగా ఎస్ఎస్ బద్రీనాథ్ గుర్తింపు తెచ్చుకున్నారు. దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద నేత్ర వైద్యశాలలలో ఒకటైన శంకర్ నేత్రాలయ స్థాపకుడు.
విదేశాలలో విద్యనభ్యసించిన బద్రీనాథ్ అనేక అధ్యయనాలు పరిశోధనలను పూర్తి చేసి భారత్కు వచ్చిన తర్వాత 1978లో చెన్నైలో ఈ కంటి ఆసుపత్రిని స్థాపించారు. చాలాకాలంపాటు దీనికి ఛైర్మన్గా వ్యవహరించారు. బద్రీనాథ్ మృతిపై శంకర నేత్రాలయ సంస్థ స్పందిస్తూ.. ‘మా లెజెండ్, శంకర నేత్రాలయ స్థాపకుడు డాక్టర్ ఎస్ఎస్ బద్రీనాథ్ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు’ అని తెలిపింది.
ఆయన అంత్యక్రియలు బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో జరిగాయి. చెన్నైలో 1940 ఫిబ్రవరి 24న జన్మించిన సెంగమేడు శ్రీనివాస బద్రీనాథ్ యుక్తవయస్సులో ఉన్నప్పుడే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు. తల్లిదండ్రుల మృతి అనంతరం వచ్చిన బీమా డబ్బుతో వైద్య శాస్త్రంలో తన చదువు పూర్తి చేశారు.
అనంతరం న్యూయార్క్లో డాక్టర్ వఅత్తిని ప్రారంభించి అనేక నేత్ర వైద్య కేంద్రాలలో శిక్షణ పొందారు. తిరిగి భారత్కు వచ్చి 1978లో డాక్టర్ బద్రీనాథ్, వైద్యుల బృందం సాయంతో చెన్నైలోని శంకర నేత్రాలయ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉచిత వైద్య చికిత్సను అందించడానికి కృషి చేశారు.
ఆయన స్థాపించిన శంకర నేత్రాలయ సంస్థ ప్రతి రోజూ వందల మంది పేదలకు ఉచిత వైద్య చికిత్స కేంద్రంగా మారింది. కాగా బద్రీనాథ్ భార్య వాసంతి పీడియాట్రిషియన్, హెమటాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమారులు అనంత్, శేషు. దేశం లోనే అత్యుత్తమ కంటివైద్యులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
బద్రీనాథ్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. కంటి శస్త్రచికిత్సల్లో ఆయన చేసిన నిర్విరామ సేవ, సమాజానికి కొన్ని తరాల పాటు స్ఫూర్తి కలిగిస్తుందని నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్, ఎఐడిఎంకె ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి బద్రీనాధ్కు నివాళులు అర్పించారు.
More Stories
ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్కు కంగనా వీడ్కోలు
కేజ్రీవాల్ నిరసన పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్తత
ఆరు నెలల్లో భారత్ లో భాగం కానున్న ఆక్రమిత కాశ్మీర్