టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఫైబర్నెట్ కుంభకోణం కేసులో నిందితుల ఆస్తుల్ని జప్తు చేయాలని నేర దర్యాప్తు విభాగం(సీఐడీ)ని మంగళవారం విజయవాడ అవినీతి నిరోధకశాఖ న్యాయస్థానం (ఏసీబీ కోర్టు) ఆదేశించింది. ఫైబర్నెట్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్కు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ, ఏసీబీ కోర్టును నవంబర్ 6న ఆశ్రయించింది.
టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తుల్ని జప్తు చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. అంతకు ముందు సీఐడీ ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించింది. నిందితులకు సంబంధించి.. ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల జప్తుకు అనుమతివ్వాలని పిటిషన్లో సీఐడీ కోరింది.
తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు; నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇళ్లు జప్తు చేయాలని సిఐడి కోరింది.
మొత్తంగా జప్తు చేసే ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యామని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ పేర్లు ఉండగా, చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఐడీ
ఇలా ఉండగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సీఐడీ సుప్రీంలో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో తీర్పు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే.
More Stories
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సందేహాలపై కేంద్ర మంత్రి ఆగ్రహం
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం