పాలస్తీనియన్లు తక్షణమే దక్షణ గాజా విడిచిపెట్టాలి

హమాస్‌ మిలిటెంట్లను సమూలంగా నాశనం చేస్తామని శపథం చేసిన ఇజ్రాయేల్ గాజాను ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి దాడులు కొనసాగిస్తోంది. ఉత్తర గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. తాజాగా, దక్షిణ గాజాపై దృష్టిసారించింది. అక్కడ ఉన్న పాలస్తీనియన్లు తక్షణమే ఈ ప్రాంతాన్ని వీడి వెళ్లాలని హెచ్చరించింది. 
 
దక్షిణ గాజా నుంచి పశ్చిమ ప్రాంతానికి తరలివెళ్లాలని సూచించింది. దక్షిణ గాజాపైనా దాడులకు సిద్ధమైన ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఇప్పటికే అక్కడ కొన్ని ప్రాంతాలపై దాడులు మొదలు పెట్టింది. ‘దక్షిణ గాజాలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించాం. ఇది అంత సులభం కాదన్న విషయం మాకు తెలుసు. కానీ, తప్పదు.. ఎదురుకాల్పుల్లో పౌరులు చిక్కుకోకూడదని మేం భావిస్తున్నాం’ అని ఇజ్రాయేల్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. 
 
దక్షిణ గాజా నగరం ఖాన్‌ యూనిస్‌లో 4 లక్షల వరకు పౌరులు ఉంటారు. వీరతోపాటు ఇజ్రాయేల్ దాడులతో ఇటీవల ఉత్తర గాజా నుంచి వేలాది మంది ఈ ప్రాంతానికి వలస వచ్చారు. ప్రస్తుతం వీరందర్నీ పశ్చిమ ప్రాంతానికి వెళ్లిపోవాలని ఇజ్రాయేల్‌ హెచ్చరించింది. అక్కడైతే మానవతా సాయం సులువుగా పొందవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో మరోసారి వలసబాట పట్టక తప్పేలా లేదని పాలస్తీనీయులు భయాందోళనకు గురవుతున్నారు. 
 
మరోవైపు, అల్-షిఫా సహా పలు ఆస్పత్రుల్లో ఇజ్రాయేల్ దళాల సోదాలు కొనసాగుతున్నాయి. గాజాలోని ప్రధాన ఆస్పత్రులను హమాస్ తమ కమాండ్ సెంటర్లుగా వినియోగించుకుంటోందని ఇజ్రాయేల్ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలుగా పలు వీడియోలను విడుదల చేసింది. ఆస్పత్రుల నుంచి సొరంగాలకు దారులు ఉన్నాయని, రక్షణంగా బుల్లెట్ ప్రూఫ్ డోర్ల ఏర్పాటుచేశారని చెబుతోంది.
 
ట‌న్నెల్‌కు చెందిన ప్రవేశం ఉన్న ప్రాంతాన్ని ఐడీఎఫ్ గుర్తించింది. ఎక్స్ అకౌంట్‌లో ఆ వీడియోను, ఫోటోల‌ను రిలీజ్ చేశారు. గాజా సిటీలో ఉన్న షిఫా ఆస్ప‌త్రికి ఈ ట‌న్నెల్‌నే దారిగా హ‌మాస్ వాడుతున్న‌ట్లు ఐడీఎఫ్ పేర్కొన్న‌ది. హాస్పిట‌ల్ కాంప్లెక్స్‌లో ఉన్న బిల్డింగ్‌ల మ‌ధ్య ఆ ట‌న్నెల్ ఎంట్రెన్స్ ఉన్న‌ట్లు ఐడీఎఫ్ గుర్తించింది. ట‌న్నెల్‌కు స‌మీపంలో ఉన్న ఓ ఆయుధాల ట్ర‌క్కును గుర్తించారు. అక్టోబ‌ర్ 7వ తేదీన జ‌రిగిన దాడిలో ఆ ఆయుధాలు వాడిన‌ట్లు భావిస్తున్నారు.
గాజా స్ట్రిప్‌లో శనివారం కొంత మేర ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలు పునరుద్ధరణ జరిగింది. కాగా ఖాన్ యూనిస్‌లో శనివారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఓ భవనం దెబ్బతింది. శివార్లలో ఉన్న పట్టణంలో జరిగిన ఈ దాడిలో దాదాపు 26 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు వెల్లడైంది.