గాజాను అంతిమంగా పాలస్తీనా అథారిటీ పరిపాలించాలి

ఇజ్రాయిల్‌- హమాస్‌ యుద్ధం తర్వాత వెస్ట్‌బ్యాంక్‌, గాజాను అంతిమంగా  పాలస్తీనా అథారిటీ పరిపాలించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్పష్టం చేశారు.  యుద్ధం అనంతరం గాజా విషయంలో అమెరికా అభిప్రాయాన్ని బైడెన్‌ వాషింగ్టన్‌ పోస్ట్‌లోని ఓ ఆర్టికల్‌లో వెల్లడించారు. ”మేము శాంతి కోసం ప్రయత్నిస్తున్నాం. గాజా, వెస్ట్‌బ్యాంక్‌లు పాలస్తీనా పాలన కిందకు రావాలి. పాలస్తీనా అథారిటీని బలోపేతం చేయాలి. మనమందరం అంతిమంగా రెండు దేశాల పరిష్కారం కోసం కృషి చేయాలి ” అని వాషింగ్టన్‌ పోస్ట్‌లో బైడెన్‌ తెలిపారు.

 ”గాజా నుంచి పాలస్తీనా వాసులను బలవంతంగా తరలించకూడదు.  ఆ ప్రాంతాన్ని తిరిగి  ఆక్రమించకూడదు. ముట్టడి లేదా దిగ్బంధం చేయకూడదు. పాలస్తీనా భూభాగ విస్తీర్ణాన్ని తగ్గించకూడదు.” అని పేర్కొన్నారు. వెస్ట్‌బ్యాంక్‌లో పౌరులపై దాడులు చేసే ఉగ్రవాదులకు వీసా నిషేధాలను జారీ చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని బైడెన్‌ తెలిపారు. 

వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై దాడులను ఆపాలని, హింసకు పాల్పడే వారు జవాబుదారీగా ఉండాలని ఇజ్రాయిల్‌ నేతలతో తాను స్పష్టం చేశానని చెప్పారు.  గాజా ప్రాంతం మొత్తానికి సైనిక రక్షణ బాధ్యతలను తాము చూస్తామని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇలా ఉండగా, ఇజ్రాయిల్‌, హమాస్‌ల మధ్య ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని వైట్‌ హౌస్‌ స్పష్టం చేసింది. ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా కృషి కొనసాగిస్తోందని అధికార ప్రతినిధి ఒకరు శనివారం రాత్రి తెలిపారు. ఇజ్రాయిల్‌ మరియు హమాస్‌ కాల్పుల విరమణపై ఇప్పటివరకు ఇంకా ఒప్పందం కుదరలేదని పేర్కొన్నారు. 

50 లేదా అంతకంటే ఎక్కువ మంది బందీలను దశలవారీగా విడుదల చేసేందుకు గాను ఐదు  రోజుల కాల్పుల విరమణకు సంబంధించి  ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య ఖతార్‌ మధ్యవర్తిత్వంతో  ఒప్పందం చేసుకుందని తెలిపారు. అయితే,  ”ఇంకా ఒప్పందం జరగలేదు. కానీ మేము ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము” అని వైట్‌ హౌస్‌ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఆడ్రియన్‌ వాట్సన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

అక్టోబబర్‌ 7న తమ దేశంపై విధ్వంసం సృష్టించిన తర్వాత హమాస్‌ 1200 మందిని బందీలుగా పట్టుకున్నట్లు ఇజ్రాయిల్‌ ఆరోపిస్తోంది. గాజాపై యుద్ధం ఏడవవారంలోకి ప్రవేశించడంతో.. హమాస్‌ పాలనలో ఉన్న గాజా స్ట్రిప్‌లోని అధికారులను 5,000 మంది చిన్నారులతో సహా 12,300 మంది మరణించారు. దక్షిణ గాజాపై ఇజ్రాయిల్‌ దాడికి సిద్ధమవుతున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రకటించింది.