‘స్వీయ -పాలన’ హెచ్చరికపై మణిపూర్ ప్రభుత్వం చర్యలు

ఇండెగ్నియస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరమ్‌ (ఐటిఎల్‌ఎఫ్‌) ‘స్వీయ -పాలన’ హెచ్చరికపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు మణిపూర్‌ ప్రభుత్వం తెలిపింది. ఐటిఎల్‌ఎఫ్‌ అల్టిమేటంను ఖండిస్తూ మణిపూర్‌ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో మణిపూర్‌లోని ప్రశాంత వాతావరణాన్ని, శాంతియుత పరిస్థితులను దెబ్బతీయడమే ఈ బెదరింపుల లక్ష్యమని  ఆరోపించింది.   

ఐటిఎల్‌ఎఫ్‌ ప్రకటనకు చట్టపరమైన, రాజ్యాంగబద్ధమైన ఆధారాలు లేవని, పూర్తిగా రెచ్చగొట్టే ఉద్దేశం కలిగి ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఐటిఎల్‌ఎఫ్‌ సంస్థ, సంబంధిత వ్యక్తులకు వ్యతిరేకంగా తగిన చర్యలు తీసుసకోనున్నట్లు తెలిపింది. రెండు వారాల్లోగా ప్రత్యేక – ప్రభుత్వం డిమాండ్‌ను నెరవేర్చకపోతే కుకీ కమ్యూనిటీ ఆధిపత్యం కలిగిన మూడు జిల్లాల్లో స్వీయ -పాలనను ఏర్పాటు చేయనున్నట్లు నవంబర్‌ 15న ఐటిఎల్‌ఎఫ్‌ అల్టిమేటం జారీ చేసింది. 

రాష్ట్రంలో రెండు కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలు హింసాత్మక పరిస్థితులకు దారితీసి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ తమ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లోగా తమ డిమాండ్‌పై స్పందించకపోతే కేంద్ర ప్రభుత్వం గుర్తించినా లేదా గుర్తించకపోయినా స్వీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 

మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌ (లమ్కా), కాంగ్‌పోక్సి, తెంగ్నౌపాల్‌ జిల్లాల్లో కుకీలు అధికంగా నివసిస్తుంటారు. మణిపూర్‌లో మే 3న కుకీ-మైతీల మధ్య ఘర్షణలు రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. కుకీలపై మైతీలు చేపట్టిన దాడుల్లో సుమారు 200 మంది మరణించగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారు.