ఎస్సై నియామక ప్రక్రియపై ఏపీ హైకోర్టు స్టే

రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగ నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. ఎస్సై రిక్రూట్‌మెంట్‌లో తమ అన్యాయం జరిగిందంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. నియామక ప్రక్రియను నిలివేయాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషనర్లు వాదనలతో ఏకీభవించింది. 
 
2019లో ఎత్తుపరంగా అర్హత సాధించిన తమను  ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషనర్ల తరఫున లాయర్ జడ శ్రావణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎత్తు అంశంలో తమ క్లయింట్లకు అన్యాయం జరిగిందని వాదించారు. ఛాతీ, ఎత్తు డిజిటల్‌ మీటర్‌ ద్వారా లెక్కించడం వల్ల తాము అనర్హులయ్యామని తెలిపారు. 
 
 డిజిటల్‌గా కాకుండా మాన్యువల్‌గానే ఫిజికల్ పరీక్షలు నిర్వహించేలా పోలీసు నియామక బోర్డును ఆదేశించాలని వారు విజ్ఞ‌ప్తి చేశారు. అందుకే నియమాక ప్రక్రియను నిలిపివేయాలని కోరారు.  రాష్ట్రవ్యాప్తంగా 56 వేల మంది ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలకు హాజరయ్యారని, వారిలో సరిపడా ఎత్తు లేరనే కారణంగా 5 వేల మందిని తిరస్కరించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
 
 గతంలో అర్హులైనవారు ఇప్పుడు అనర్హులెలా అవుతారని ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత ప్రశ్నించారు. అనంతరం పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన జడ్ ఎస్సై నియమాక ప్రక్రియపై తాత్కాలిక స్టే విధించారు. రాష్ట్రంలో ఫిజికల్ టెస్ట్, రాతపరీక్ష పూర్తయి 35 వేల మంది అభ్యర్థులను ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. 
 
తాజాగా, హైకోర్టు నిర్ణయంతో వీరంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక రాత పరీక్షకు 1.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా, వీరిలో 57 వేల మందికిపైగా అర్హత సాధించారు. అనంతరం వీరికి ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. ఈ టెస్ట్‌ల్లో దాదాపు 35 వేల మంది పురుషులు, మహిళలు అర్హత సాధించారు. 
 
వీరికి గత నెల 14, 15 తేదీల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించగా, 30 వేల మంది మాత్రమే హాజరయ్యారు.  ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని అక్టోబరు 15న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఆన్సర్ కీపై అక్టోబరు 18 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఫైనల్ కీతోపాటు మెయిన్ పరీక్షల ఫలితాలను వెల్లడించాల్సి ఉంది.