ఆరేళ్ళ తర్వాత అమెరికాలో అడుగుపెట్టిన జిన్‌పింగ్‌

ఆరేళ్ళ తర్వాత అమెరికాలో అడుగుపెట్టిన జిన్‌పింగ్‌
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ చాలా ఏళ్ల తర్వాత అమెరికా పర్యటనకు వెళ్లారు. శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా జరుగనున్న ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార మండలి శిఖరాగ్ర సదస్సుకు యూఎస్‌ ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్‌ అగ్రరాజ్యం వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోలో అడుగుపెట్టారు. 
 
జిన్‌పింగ్‌ సుమారు ఆరేళ్ల తర్వాత అమెరికా పర్యటకు వెళ్లడం ఇదే మొదటి సారి. చివరిసారిగా ఆయన 2017లో అగ్రరాజ్యంలో పర్యటించారు.  కాగా, జిన్‌పింగ్‌ ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం బైడెన్‌తో జిన్‌పింగ్‌ ధ్వైపాక్షిక భేటీలో పాల్గొననున్నారు. ఆ తర్వాత అపెక్‌ సదస్సుకు హాజరవుతారు. 
 
కాగా, ఇద్దరు దేశాధినేతల భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, తైవాన్‌ అంశాలు చర్చకు రానున్నట్లు వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు, మరోవైపు ఇజ్రాయెల్- హమాస్‌ పోరు నేపథ్యంలో బైడెన్‌, జిన్‌పింగ్‌ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. 
అయితే వీరి భేటీలో ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం అంశం చర్చకు వస్తుందా..? లేదా..? అనే విషయంలో వైట్‌హౌస్‌ స్పష్టత ఇవ్వలేదు.
గత ఏడాది కాలంలో ఈ ఇద్దరు దేశాధినేతలు ముఖాముఖీ కలుసుకోవడం ఇదే కావడంతో చైనాతో తమ సంబంధాలను మెరుగు పరచుకొనే ప్రయత్నం బిడెన్ చేయగలరని భావిస్తున్నారు. యుక్రెయిన్ యుద్ధం, రష్యాతో ఉత్తర కొరియా సంబంధాలు, కుత్రిమ మేధస్సు వంటి అంశాలు వీరి చర్చలలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
జిన్‌పింగ్‌  అమెరికా చేరుకోవడానికి రెండు గంటల ముందుగా అమెరికా  సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ 21-సభ్యుల అపెక్ మంత్రులను ఉద్దేశించి ప్రసంగిస్తూ  “ఆర్థిక వ్యవస్థలు తమ స్వంత మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి. ఇక్కడ వస్తువులు, ఆలోచనలు, ప్రజలు చట్టబద్ధంగా, స్వేచ్ఛగా పయనింపగలగాలి” అంటూ చైనా పేరు ప్రస్తావించకుండా పేర్కొన్నారు.
కాగా, ఇజ్రాయెల్- హమాస్‌ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. మరోవైపు డ్రాగన్‌ దేశం చైనా పాలస్తీనీయులకు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌కు తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఉందని, అయితే అది అంతర్జాతీయ మానవతా చట్టాల పరిధికి లోబడి మాత్రమే ఉండాలని చైనా సూచించింది.  అంతేగాక పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మార్చడమే ఈ యుద్ధానికి ఏకైక పరిష్కారమని ఇటీవల డ్రాగన్‌ పునరుద్ఘాటించింది. కాగా, శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే అపెక్‌ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీని కూడా బైడెన్‌ ఆహ్వానించారు.