15 నుంచి వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రెండు నెలల పాటు దేశవ్యాప్తంగా ప్రజల్ని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల్ని చేరుకోవడం, అర్హులందరికీ ఆ పథకాలు అందేలా చూసేందుకు ఓ భారీ ప్రచార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టబోతున్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరుతో జార్ఖండ్ లో నవంబర్ 15న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

గిరిజన నేత బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఖుంటిలోని ఉలిహతు గ్రామం నుంచి ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. గిరిజనుల జన్మస్థలమైన ఉలిహతును సందర్శించబోతున్న తొలి ప్రధాని మోదీయే కావడం విశేషం. బిర్సా ముండా జయంతిని మోదీ ప్రభుత్వం `జనజాతీయ గౌరవాదివాస్’ (గిరిజన దినోత్సవం)గా పాటిస్తున్నది.
ప్రధాని `వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ను  బిర్సా ముండా స్వస్థలం నుండి ప్రారంభించబోవడం పట్ల కేంద్ర గిరిజన వ్యవహారాల  శాఖ మంత్రి అర్జున్ ముండా హర్షం ప్రకటించారు.  బిర్సా ముండా గొప్ప స్వతంత్ర సమరయోధుడే కాకుండా సామజిక సంస్కర్త అని కూడా ఆయన చెప్పారు. గిరిజన  సమాజం, గిరిజన  ప్రాంతాలు అభివృద్ధి  చెందనిదే తన ప్రయాణం పూర్తి కాబోదని ప్రధాని భావిస్తున్నారని ఆయన తెలిపారు.
 
యాత్ర మొదట్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల నుండి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి 25 నాటికి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలను కవర్ చేస్తుంది. 3వేల వ్యాన్లతో ఈ యాత్ర రెండు నెలల పాటు కొనసాగుతుంది. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 15వేల పట్టణ ప్రాంతాలను ఈ యాత్ర కవర్ చేస్తుంది. 
 
ప్రతి వ్యాన్‌ రెండు గంటలపాటు గ్రామ పంచాయతీలో ఉండి, ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్న అర్హులైన లబ్దిదారులను గుర్తించి వారికి వాటిని అందేలా చూస్తుంది. దీని ప్రధాన లక్ష్యం దిగువ, మధ్యతరగతి జనాభా. వారు కేంద్ర పథకాల ప్రయోజనాలను పొందేలా చూడటమే.
 
 నవంబర్ 22 వరకు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 69 జిల్లాల్లోని 393 ట్రైబల్ బ్లాక్‌లు, 9వేల గ్రామ పంచాయతీలు ఈ యాత్రలో కవర్ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ తరువాత ఈ యాత్ర ఇతర గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తారు. చివరికి వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టాలనేది ప్రధాని మోదీ లక్ష్యంగా కనిపిస్తుంది.