బీజేపీ గెలిస్తే ఉచితంగా అయోధ్య దర్శనం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తాము అధికారం లోకి వస్తే మధ్యప్రదేశ్ ప్రజలను ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య దర్శనానికి తీసుకెళ్తామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు. విదిశ జిల్లా సిరోంజ్ అసెంబ్లీ నియోజక వర్గంలో అమిత్‌షా సోమవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు.

“నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామమందిర నిర్మాణ తేదీ ఎప్పుడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదేపదే అడిగేవారు. ఆయనకు ఇప్పుడు సమాధానం చెబుతున్నా. 2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది” అని తెలిపారు.

ఐతే వెంటనే అక్కడున్న ఓ బీజేపీ నేత స్పందిస్తూ.. అయోధ్య రామ మందిర దర్శనానికి తాము డబ్బులు పెట్టుకోవాలా? అని ప్రశ్నించారు. దానికి బదులిచ్చిన అమిత్ షా.. ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీని గెలిపిస్తే.. రాష్ట్ర ప్రజలకు అయోధ్య దర్శనాన్ని ఉచితంగానే కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను దశలవారీగా అయోధ్యకు తీసుకెళ్తామని చెప్పారు.

 “మీరు ఎలాంటి ఖర్చూ చేయాల్సిన అవసరం లేదు.మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామమందిర దర్శనం కల్పిస్తాం. దశలవారీగా మిమ్మల్ని అయోధ్యకు తీసుకెళ్తాం. మా ఎన్నికల మేనిఫెస్టో లోనూ ఈ హామీని ప్రకటించాం” అని వెల్లడించారు.

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్.. వచ్చే ఎన్నికల్లో తమ కుమారులను సీఎం చేయాలని ప్లాన్లు వేస్తున్నారు. ఇక, సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేయాలని చూస్తున్నారు. తమ కొడుకులు, కుమార్తెల కోసం మాత్రమే రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకు ఎలా సేవ చేస్తారు? అని అమిత్ షా నిలదీశారు.

కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ గత వారం మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. 450కే గ్యాస్ సిలిండర్, పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య వంటి వరాలు కురిపించింది. నవంబర్ 15తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి.