చత్తీస్‌గఢ్‌ను లూటీ చేయడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యం

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ల పాటు పంచాయతీనుంచి పార్లమెంటు దాకా అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒబిసిలకు రిజర్వేషన్లు అమలుచేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సోమవారం చత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో జరిగిన బిజెపి ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ చత్తీస్‌గఢ్‌ను లూటీ చేసి తన బొక్కసాలు నింపుకోవాలన్నదే కాంగ్రెస్ ఏకైక లక్షమని దుయ్యబట్టారు. 

గత అయిదేళ్ల కాలంలో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ కుమారుడు, ఆయన బంధువులు, ఆయనకు సన్నిహితంగా ఉండే అధికారులు చత్తీస్‌గఢ్‌ను నిలవునా దోచుకున్నారని కూడా ప్రధాని ఆరోపింఛారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ నాయకుడు కూడా సామాజిక మాధ్యమాల్లో స్థానిక ఉత్పత్తులనే కొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేయలేదని తాను సవాల్ చేసి చెప్పగలనని కూడా ఆయన పేర్కొన్నారు. 

చత్తీస్‌గఢ్‌లో జరిగిన తొలి విడత ఎన్నికలు కాంగ్రెస్ ‘అబద్ధాల బుడగ’ను పేల్చేసిందని చెబుతూ ఇప్పడు రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలని నిర్ణయిచుకున్నారని ప్రధాని స్పష్టం చేశారు. 90 అసెంబీల స్థానాలున్న చత్తీస్‌గఢ్ అసెంబ్లీలో 20 స్థానాలకు ఈ నెల 7న తొలి విడత పోలింగ్ జరగ్గా, ఈ నెల 17న మిగతా నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.

గత పదేళ్ల కాలంలో కేబిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలకోసం 4 కోట్ల ఇళ్లను నిర్మించిందని ఆయన చెప్పారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి అడ్డంకులు సృష్టించిందని ఆయన ఆరోపించారు. ఢిల్లీనుంచి వచ్చే కొంతమంది కాంగ్రెస్ మహాజ్ఞానులు బహిరంగ సభల్లో మోదీ  ఒబిసి కులానికి చెందిన వాడని చెప్పడంద్వారా తన కులానికి ప్రచారం కల్పిస్తున్నారని ప్రధాని ఎద్దేవా చేశారు. 

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇదే కాంగ్రెస్ నేతలు మోదీ పేరున్న నేతలంతా దొంగలేనంటూ విమర్శించారని ఆయన గుర్తు చేశారు. చత్తీస్‌గఢ్‌లో బలమైన ఒబిసి వర్గం సాహులకు కాంగ్రెస్ పార్టీ గత అయిదేళ్లలో ఏం చేసిందో అందరికీ తెలిసిందేనని, దాన్ని బట్టి కాంగ్రెస్ వాళ్ల మనస్తత్వం ఏమిటో అర్థం చేసుకోవచ్చని కూడా మోదీ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు ఒబిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వలేదని, వైద్య కళాశాలల్లో ఒబిసి రిజర్వేషన్లు అమలు చేయలేదని పేర్కొంటూ అయితే మోదీ  ఇవన్నీ చేయడం ద్వారా మీకు ఒక గ్యారంటీ ఇచ్చారని ఆయన తెలిపారు. చత్తీస్‌గఢ్‌లో ఇది తన చివరి బహిరంగ సభ అని ప్రధాని అంటూ, రాష్ట్రంలో బిజెపి విజయం ఖాయమని భరోసా వ్యక్తం చేశారు. మీ పిల్లల భవిష్యత్తు నిర్మాణం కోసం తనకు మద్దతు ఇవ్వాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఈ నెల ఏడో తేదీన 20 అసెంబ్లీ స్థానాలకు జరిగిన తొలివిడత పోలింగ్‌ కాంగ్రెస్‌ అబద్ధాల బుడగను పేల్చివేసిందని, 17న మిగతా 70 స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రధాని తెలిపారు. ఆ పార్టీకి కౌంట్‌డౌన్‌ మొదలైందని.. బీజేపీ విజయం తథ్యమని భరోసా వ్యక్తం చేశారు.