శుక్రుడు, అంగారకుడిపైకి చేరుకోవాలని భారత్ లక్ష్యం

ఎంతో ప్రతిష్టాత్మకమైన, సంక్లిష్టమైన చంద్రయాన్‌ పూర్తవడం,  సూర్యయాన్‌ కూడా విజయవంతం కావడంతో పాటు గగన్‌యాన్‌ (మానవ సహిత అంతరిక్షయానం) కోసం టెస్ట్‌ ఫ్లైట్‌ విజయవంతంగా ముగియడంతో  భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మరిన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంది.  రాబోయే ఐదేళ్ల కాలంలో భూమికి పొరుగున ఉన్న శుక్రుడు, అంగారకుడిపైకి చేరుకోవాలని ఉబలాట పడుతోంది.

ఆయా గ్రహాలపై భారతీయ పతాకాన్ని ఎగురవేయాలని భావిస్తోంది అని బెంగళూరులోని యుఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం శంకరన్‌ చెప్పారు. కక్ష్యలో ఉన్న డజన్ల కొద్దీ భారతీయ ఉపగ్రహాల వెనుక ”పవర్‌హౌస్‌” విభాగానికి అధిపతి అయిన డాక్టర్‌ శంకరన్‌ భవిష్యత్‌ ప్రయోగాలపై కొన్ని సవాళ్లను గుర్తించారు. 

అయితే మిషన్‌ కాన్సెప్ట్‌లపై అంతర్గత చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయని వెల్లడించారు. అంగారకుడి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు వ్యోమనౌక వేడెక్కడం, ప్రతి మిషన్‌కు సరైన ప్రయోగ విండోను కనుగొనడం వంటి స్వంత సవాళ్లను పరిష్కరించడంపై దృష్టిపెట్టింది.

అంగారక గ్రహం, శుక్రుడు లేదా అంతకు మించిన మిషన్‌లకు అవసరమైన భారీ పేలోడ్‌లను మోసుకెళ్లగల ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం వంటి సాధారణ రవాణా సవాళ్లు కూడా తమ ముందున్నాయని డా. శంకరన్‌ చెప్పుకొచ్చారు. గత రెండేళ్లుగా, తాము అంగారకుడిపై ల్యాండింగ్‌ కోసం మిషన్‌ కాన్ఫిగరేషన్‌లను అధ్యయనం చేస్తున్నామని వివరించారు. 

సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సెన్సార్ల సమర్థత, అధిక ద్రవ్యరాశిని కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం గురించిన సవాళ్లను అధిగమించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఎల్‌విఎం3 కెపాసిటీ, ల్యాండింగ్‌ అవసరాలను తీర్చడంలో సమస్యలున్నాయి. వ్యోమనౌక అంగారకుడి వాతావరణంలోకి ప్రవేశించడం అదనపు ఉష్ణ రక్షణ అవసరం. మేము దీనిని అధ్యయనం చేస్తున్నామని  తెలిపారు. 

“ఎల్‌విఎం3కి మెరుగులు దిద్దుతున్నాం. వచ్చే రెండేళ్లలో 20-30 శాతం సామర్థ్యం పెంచుతాం. భవిష్యత్తు అంతరిక్ష యాత్రలకు మాత్రమే కాకుండా, ఇతర దేశాల ప్రయోగాల కోసం మరిన్ని ఉపగ్రహాలను తీసుకువెళ్లడానికి ఇది కీలకమైనది. మార్స్‌ ల్యాండర్‌ మిషన్‌ కోసం ఒక ప్రణాళికను రూపొందించాలి. ఆ దిశగా ఇప్పుడు మనం ముందుకు సాగాలి” అని శంకరన్‌ వివరించారు.

నవంబర్‌ 2013లో ప్రయోగించిన మంగళయాన్‌ విజయం తర్వాత ప్రతిపాదిత మార్స్‌ మిషన్‌ సెప్టెంబర్‌ 2014లో గ్రహం చుట్టూ తిరగడం ప్రారంభించింది. గతేడాది అక్టోబర్‌లో ఇస్రో మాడ్యూల్‌తో సంబంధాన్ని కోల్పోయే ముందు అమూల్యమైన డేటాను పంపింది. ఇక వీనస్‌పైకి వెళ్లే మిషన్‌ మనకు మొట్టమొదటిది. 

చంద్రయాన్‌-3 విజయం విశ్వాసాన్ని పెంచిందని చెబుతూ శుక్రయాన్‌ సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ”మార్స్‌, వీనస్‌ మిషన్లు శక్తి (ఉపయోగం) పరంగా చక్రీయ అవకాశాలను కలిగి ఉంటాయి. మనం ఏ రోజునైనా ప్రయోగించవచ్చు… కానీ భూమి, సూర్యుని సాపేక్ష స్థానాన్ని బట్టి కొంత వ్యవధి పడుతుంది. వచ్చే రెండేళ్లలో వీనస్‌ ప్రయత్నాలు మొదలవుతాయి” అని శంకరన్‌ వివరించారు.