అభ్యర్థులలో సంపన్నుడు వివేక్… `నిరుపేద’ సంజయ్

తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేయగా మొత్తం 5,716 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక అత్యధికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో నామిషన్లు వేశారు.
 
గజ్వేల్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 145 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. ఇక కేసీఆర్ పోటీ చేస్తున్న మరో స్థానం కామారెడ్డిలోనూ 92 మంది నామినేషన్‌ వేయడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 116 మంది నామినేషన్లు వేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేస్తుండగా… గజ్వేల్ నుంచి బీజేపీ నేత ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
 
ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ఆధారంగా తెలంగాణాలో పోటీ చేస్తున్న అభ్యర్దుల్లో సంపన్నుడు గడ్డం వివేక్ వెంకటస్వామి కాగా, నిరుపేద బీజేపీ నేత బండి సంజయ్ గా నిలిచారు. టాప్ -20 లో పది మంది కాంగ్రెస్ నేతలే ఉన్నారు.

వారిలో చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న గడ్డం వివేక్‌ రూ.606 కోట్లతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. గడ్డం వివేక్‌ ఆస్తులు రూ.606.67 కోట్లుగా పేర్కొన్నారు. చరాస్తులు రూ.380.76 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.225.91 కోట్లు అని ఆయన తెలిపారు. తనకు, తన భార్యకు రూ.45.44 కోట్ల ఆప్పులు ఉన్నట్లు వివరించారు.

ఇక, కారు గుర్తు గల బీఆర్‌ఎస్‌ అధిపతి, ముఖ్యమంత్రి  కేసీఆర్‌కు కారే లేదు. ఆయన కుటుంబానికి రూ.58.93 కోట్ల మేర ఆస్తులున్నాయి. వీటిలో స్థిరాస్తులు రూ.23.50 కోట్లు, చరాస్తులు రూ.35.43 కోట్లు. మాజీ ఎంపీ జి.వివేక్‌ నుంచి రూ.1.06 కోట్లు అప్పు తీసుకున్నట్లు కేసీఆర్‌ పేర్కొన్నారు.

కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్‌ తన కుటుంబానికి మొత్తం రూ.53.31 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో ప్రకటించారు. ఇందులో చరాస్తులు రూ.35.01 కోట్లు, స్థిరాస్తులు రూ.18.30 కోట్లు కాగా, రూ.11.99 కోట్ల మేర రుణాలున్నాయని వెల్లడించారు. 4.8 కిలోల బంగారం, 38.17 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు.

గజ్వేల్‌, హుజూరాబాద్‌ ల నుండి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు రూ.50.93 కోట్ల మేర ఆస్తులున్నాయి. ఇందులో చరాస్తులు రూ.23.65 కోట్లు, స్థిరాస్తులు రూ.27.28 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనకు కారు లేదని.. 13.25 ఎకరాల భూమి ఉన్నట్లు చెప్పారు

సిద్దిపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి హరీశ్‌రావు కుటుంబ ఆస్తి రూ.24.29 కోట్లు. కుటుంబానికి మొత్తం రూ.11.50 కోట్ల అప్పులుఉన్నాయి. మధిర కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కకు నయాపైసా అప్పు లేదు. కుటుంబ సభ్యులందరికీ కలిపి రూ.8.13 కోట్ల మేర ఆస్తులున్నాయి. హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి రూ.5.82 కోట్ల మేర ఆస్తులున్నాయి.

తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ ప్రకటించారు. తనకు ఒకటి, భార్య పేరిట మరో కారు ఉన్నాయని తెలిపారు. చేతిలో రూ.లక్షన్నర, సతీమణి దగ్గర రూ.లక్ష నగదు ఉన్నాయని తెలిపారు. చరాస్తుల విలువ రూ.79.51 లక్షలని, కుటుంబానికి ఎలాంటి స్థిరాస్తులు లేవని ప్రకటించారు. రూ.17.84 లక్షల మేర అప్పులున్నట్లు పేర్కొన్నారు.

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ ఆస్తులు రూ.461.05 కోట్లు. ఆయన వార్షికాదాయం రూ.32.07 లక్షలు కాగా.. పొంగులేటి సతీమణి మాధురి ఆదాయం రూ.3.04 కోట్లు. అవిభాజ్య కుటుంబ ఆదాయం రూ.6.50 లక్షలే.  రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో మొత్తం 4,798 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అయితే వారిలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి 30 మంది భారీ కోటీశ్వరులు బరిలో ఉన్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థుల ఆస్తులు

  • పైళ్లా శేఖర్ రెడ్డి – రూ.227 కోట్లు
  • కె.ప్రభాకర్ రెడ్డి – రూ.197 కోట్లు
  • బి.గణేష్ – రూ.124.4 కోట్లు
  • జనార్ధన్ రెడ్డి – రూ.112.3 కోట్లు
  • రాజేందర్ రెడ్డి – రూ.111.2 కోట్లు
  • మర్రి రాజశేఖర్ రెడ్డి – రూ.97 కోట్లు
  • సీహెచ్.మల్లారెడ్డి – రూ.95.94 కోట్లు
  • కె.ఉపేందర్ రెడ్డి – రూ.89.57 కోట్లు
  • బండారు లక్ష్మారెడ్డి – రూ.85.75 ఓట్లు
  • ఎ.గాంధీ – రూ.85.14 కోట్లు

బీజేపీ అభ్యర్థులు

  • ఎం.రవి కుమార్ యాదవ్ – రూ.166.63 కోట్లు
  • ధర్మపురి అరవింద్ – రూ.107.43 కోట్లు
  • ఈటల రాజేందర్ – రూ.53.94 కోట్లు
  • మర్రి శశిధర్ రెడ్డి – రూ.51.14 కోట్లు
  • కె.వెంకటరమణ రెడ్డి – రూ.49.71 కోట్లు
  • వి.రఘునాథ రెడ్డి – రూ.48.18 కోట్లు
  • బేతి సుభాష్ రెడ్డి – రూ.42.55 కోట్లు
  • పి. కాళ్ల ప్రసాద్ రావు – రూ.39.88 కోట్లు
  • వి.మోహన్ రెడ్డి – రూ.38.68 కోట్లు
  • నివేదిత – రూ.34.95 ఓట్లు

కాంగ్రెస్ అభ్యర్థులు

  • వివేక్ వెంకట స్వామి – రూ.606 కోట్లు
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – రూ.458.9 కోట్లు
  • పి.శ్రీనివాస్ రెడ్డి – రూ.433.3 కోట్లు
  • జి.వినోద్ – రూ.197.12 కోట్లు
  • వి.జగదీశ్వర్ గౌడ్ – రూ.124.14 కోట్లు
  • ఎం.సునీల్ కుమార్ – రూ.104.13 కోట్లు
  • పి.సుదర్శన్ రెడ్డి – రూ.102.20 కోట్లు
  • కె.హన్మంతు రెడ్డి – రూ.95.34 కోట్లు
  • ఎం.రంగారెడ్డి – రూ.83.78 కోట్లు
  • కె.మదన్ మోహన్ రావు – రూ.71.94 కోట్లు