సినీ నటి రష్మిక మందన్నా డీప్ఫేక్ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. టెక్నాలజీ దుర్వినియోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ తరహా వీడియోలను అడ్డుకోవటంపై కేంద్ర ఐటీ శాఖ మంగళవారం స్పందించింది. ఇలాంటి వీడియోలను అడ్డుకోవాల్సిన బాధ్యత సోషల్ మీడియా సంస్థలదేనని స్పష్టం చేసింది.
ఇందుకు సంబంధించి సోషల్ మీడియా కంపెనీలకు ఒక అడ్వయిజరీని జారీ చేసింది. కృత్రిమ మేధ (ఏఐ)తో కంటెంట్ను తయారుచేస్తూ తప్పుదోవ పట్టిస్తున్న వాటిపై 24 గంటల్లోగా చర్యలు చేపట్టాలని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్..తదితర సోషల్ మీడియా సంస్థలకు సూచించింది. ఐటీ చట్టం-2000 సెక్షన్ 66-డీ కింద చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు అవకాశముందని తెలిపింది.
కంప్యూటర్ సాంకేతికతను ఉపయోగించి వ్యక్తుల్ని మోసగిస్తే ఈ సెక్షన్ కింద రూ.లక్ష వరకు జరిమానా, మూడేండ్ల జైలు శిక్ష విధించే అవకాశముందని అడ్వైయిజరీలో కేంద్రం గుర్తు చేసింది. ఐటీ నిబంధనావళిలో రూల్ 3(2) (బీ)ను ఉపయోగించి తప్పుడు వీడియోలను, కంటెంట్ను తొలగించవచ్చునని తెలిపింది.
ఫిర్యా దు అందిన 24 గంటల్లోగా మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలపై చర్యలు చేపట్టాలని పేర్కొన్నది. డీప్ఫేక్ వీడియోపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ డిమాండ్ చేశారు. మార్ఫింగ్ వీడియో తననెంతో భయానికి గురిచేసిందని నటి రష్మిక మందన్నా ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, గత ఏప్రిల్లో జారీ చేసిన ఐటీ నిబంధనల ప్రకారం సోషల్ నెట్వర్కింగ్ సైట్లు చట్టపరమైన బాధ్యతలను పాటించాల్సిందేనని కేంద్ర ఐటీ, ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.ఏ యూజర్ కూడా తమ ఖాతా నుంచి నకిలీ లేదా తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయకూడదని పేర్కొంది.
తప్పుడు సమాచారం పోస్ట్ చేయబడితే, దానిని 36 గంటలలోపు తొలగించాలని పేర్కొంటూ ఈ నిబంధనలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.మార్ఫింగ్ అత్యంత ప్రమాదకరమైన చర్యగా ఆయన అభివర్ణించారు.సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.
More Stories
లోక్సభ నాలుగో విడత 5 గంటల వరకు 62.31% ఓటింగ్
కేజ్రీవాల్ను సీఎంగా తొలగించే నిర్ణయం ఎల్జీదే!
ఆప్ ఎంపీ స్వాతిపై కేజ్రీవాల్ పిఎ దాడి!