సుప్రీంకోర్టుకు మరో ముగ్గురు జడ్జీలు

భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం ముగ్గురు హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది. ఢిల్లీ హైకోర్టు జడ్జి సతీష్‌ చంద్ర శర్మ, రాజస్తాన్‌ చీఫ్‌ జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్, గుహవటి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సందీప్‌ మెహతాలు ఈ జాబితాలో ఉన్నారు. 

ఈ ముగ్గురు జడ్జీల నియామకంతో సుప్రీంకోర్టు ఫుల్‌ బెంచ్‌ (34) కి చేరుకోనుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు 31 మంది జడ్జీలతో విధులు నిర్వహిస్తోంది. భారీగా పేరుకుపోయిన పెండింగ్‌ కేసులతో న్యాయమూర్తులపై పనిభారం గణనీయంగా పెరుగతోంది. 

దీనిని దృష్టిలో పెట్టుకుని ఏ సమయలోనైనా ఖాళీ లేకుండా సుప్రీంకోర్టులో ఫుల్‌ బెంచ్‌ ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని కొలిజియం తీర్మానంలో పేర్కొంది. జస్టిస్‌ శర్మ మధ్యప్రదేశ్‌ హైకోర్టుకి చెందగా, జస్టిస్‌ మసీహ్, జస్టిస్‌ మెహతాలు పంజాబ్‌, హర్యానా, రాజస్తాన్‌లకు చెందినవారు. 

సీనియారిటీ పరంగా చూస్తే మొత్తం దేశవ్యాప్తంగా హైకోర్టు జడ్జీల్లో జస్టిస్‌ శర్మ రెండోస్థానంలో ఉండగా, జస్టిస్‌ మసీహ్  ఏడోస్థానంలో ఉన్నారు. రాజస్తాన్‌ హైకోర్టుకు ప్రాతినిధ్యం లేదన్న కారణంతో కొలీజియం జస్టిస్‌ మెహతా పేరును పరిగణనలోకి తీసుకున్నట్లు కొలీజియం తెలిపింది.