నేపాల్‌లో మరోసారి భూకంపం.. అయోధ్యలోనూ

హిమాలయ దేశం నేపాల్‌లో వరుస భూకంపాలతో వణికిపోతున్నది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం రాగా, శనివారం మధ్యాహ్నం కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున మరోసారి ప్రకంపణలు వచ్చాయి. ఉదయం 4.38 గంటలకు రాజధాని ఖట్మండూ భూమి కంపించింది.  దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ  తెలిపింది.
భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. ఖట్మండుకు 169 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది.  అంతకు ముందు భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లో ఉన్న అయోధ్యలో కూడా భూమి కంపించింది. ఆదివారం వేకువజామున 1.07 గంటలకు భూకంపం వచ్చింది. 
రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం స్థానికులను కలవరపరిచింది. అయోధ్యకు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్ఎస్‌సీ) వెల్లడించింది. ప్రాణ, ఆస్తి నష్టం ఏమీ నమోదు కాలేదు.  అదేవిధంగా అఫ్ఘానిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.25 గంటలకు ఫైజాబాద్‌లో 4.5 తీవ్రతతో భూమి కంపించింది.
 
కాగా, శుక్రవారం రాత్రి 11.32 గంటలకు నేపాల్‌లోని జాజర్‌కోట్‌లో 6.4 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో 157 మంది మరణించగా, డజన్ల కొద్ది జనాలు గాయపడ్డారు. భారీగా ఇండ్లు నేలమట్టమయ్యాయి. వందల కొద్ది ఇండ్లు ధ్వంసమైన విషయం తెలిసిందే.