మేడిగడ్డ బ్యారేజ్‌ ఇక పనికి రానట్టే… అవినీతి బట్టబయలు

మేడిగడ్డ బ్యారేజీ ప్లానింగ్, డిజైన్ సరిగా లేవని, బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో దానిని పునాదుల నుండి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాల్సిందేనని డ్యామ్‌సేఫ్టీ అథారిటీ నివేదిక స్పష్టం చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. 

నిర్వాహణ లోపాలు, నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడిందని, బ్యారేజీ వైఫల్యం ప్రజల జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని నివేదికలో పేర్కొన్నారు. మేడిగడ్డలో ప్రస్తుతం తలెత్తిన సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు బ్యారేజీ మొత్తం ఉపయోగించే అవకాశం లేదని డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చేసింది.

ఈ నివేదికపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సంచలన ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ అవినీతి బట్టబయలు అయిందంటూ జలశక్తి మంత్రి విమర్శించారు. కేసీఆర్‌ ధనదాహం, అవినీతి, దురాశ కారణంగా.. లక్షలాది మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయని పేర్కొన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని ఆరోపించారు. కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టు ఫొటోలు, వీడియోలు, డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికను షెకావత్ ట్వీట్ చేశారు.

ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ విషయాల్లో వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణమని అభిప్రాయపడ్డారు. బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడంతో పాటు ఫౌండేషన్ కోసం వినియోగించిన మెటీరియల్ పటిష్టతలో లోపాలు, వాటి సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ ఎగువున లోడ్ వల్ల ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీనమై పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడిందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు మేడిగడ్డ కుంగిపోవడంతో కేంద్ర జలసంఘం, కేంద్రం నియమించిన కమిటీ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, 20 అంశాలపై వివరాలు అడిగితే కేవలం 12 అంశాల వివరాలను మాత్రమే ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన డేటా అసంపూర్ణంగా ఉందని నివేదికలో వివరించారు.

2023 అక్టోబర్ 29, లోపు పూర్తి వివరాలను అందించకపోతే బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని భావించాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపింది. వర్షాకాలానికి ముందు, ఆ తర్వాత ఇన్ఫెక్షన్ రిపోర్టులు, కంప్లీషన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం అందించలేదు.

ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలకు తీసుకునే అవకాశం తమకు ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ కీలకం కాగా.. అక్టోబర్​ 21న పునాది కుంగిపోయి, పిల్లర్లు దెబ్బతిన్నాయి. దీంతో నేషనల్ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ నియమించిన కమిటీ అక్టోబర్​ 23న మేడిగడ్డ బ్యారేజ్​ ని పరిశీలించింది.