మనీశ్‌ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్‌ తిరస్కరణ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్‌ సిసోడియా దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నగదు బదిలీకి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తగిన ఆధారాలు సమర్పించిందని పేర్కొంది. రూ.338 కోట్ల నగదు బదిలీ వ్యవహారం ముడిపడిన కేసు కావడంతో సిసోడియాకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.

ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ ఎన్ భట్టితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో బెయిల్ కోసం సిసోడియా వేసిన రెండు వేర్వేరు పిటిషన్‌లపై సుప్రీం కోర్టు అక్టోంబర్ 17న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బెయిల్ నిరాకరిస్తూ తీర్పు ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ ఆధారాలు చూపించండంతో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

కాగా, సిసోడియా గడిచిన ఎనిమిది నెలలుగా జైలులో ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారని, పాలసీని వ్యాపారులకు అనుకూలంగా తయారుచేశారని మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  లిక్కర్ పాలసీపై సర్వత్రా విమర్శలు రావడం, విషయం కోర్టుకు చేరడంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్కారు దీనిని పక్కన పెట్టింది. అయితే, ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది. విచారణ ప్రారంభించి ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తూ వస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియాను అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉన్నాడు. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తును కింది కోర్టులు కొట్టేయడంతో సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సిసోడియా బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.

ఇక ఈ లిక్కర్ స్కాం కేసులో విచారణను పూర్తి చేసేందుకు ఈడీకి సుప్రీంకోర్టు 6 నుంచి 8 నెలల సమయం ఇచ్చింది. విచారణ నెమ్మదిగా సాగితే మూడు నెలల లోపు సిసోడియా మళ్లీ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందుతారని సుప్రీం పేర్కొంది. లిక్కర్‌ స్కామ్‌ కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రెండూ విచారిస్తున్నాయి. ఈ క్రమంలో మనీష్‌ సిసోడియాను రెండు దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులూ ప్రశ్నిస్తున్నారు.