నవంబర్ 1 నుంచి ఢిల్లీ పరిధిలో డీజిల్ బస్సులపై నిషేధం

నవంబర్ 1 నుంచి దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో డీజిల్ బస్సులు తిరగడంపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డీజిల్‌తో నడిచే బస్సులు ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో నవంబర్ 1 నుంచి ప్రయాణించడానికి వీలు లేదని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ప్రకటించింది. కేవలం ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, బీఎస్ 6 డీజిల్ బస్సులను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపింది.

దీంతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో బాణసంచా వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీపావళి సందర్భంగా ఏర్పడే వాయు కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఢిల్లీ, పంజాబ్, హర్యాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల పర్యావరణ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ శనివారం సమావేశం నిర్వహించారు.

చలికాలంలో ఢిల్లీలో గాలి కాలుష్య తీవ్రత అధికంగా ఉంటుందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ స్పష్టం చేశారు. ఎన్‌సీఆర్ పరిధిలోని ప్రాంతాల్లో గాలి కాలుష్యాన్ని అరికట్టడానికి ఆయా రాష్ట్రాలు ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.  పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అన్ని వాహనాల ఇంజిన్‌లను బీఎస్6 కు మార్చాలని డిసెంబర్ 2019 నుంచి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెబుతూనే ఉంది. పలు మార్లు ఈ గడువును పొడగిస్తూ చివరికి ఈ ఏడాది నవంబర్‌కు ఆఖరి పొడగింపు అని పేర్కొంది.
అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఢిల్లీతోపాటు దాని చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో గాలి కాలుష్యం అత్యధికంగా ఉంటుంది. దాన్ని అడ్డుకునేందుకు ఫ్యాక్టరీలను మూసివేయడం, సరి బేసి విధానంలో రోడ్లపైకి వాహనాలను అనుమతించడం, ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే వాహనాలపై నిషేధం విధించడం, బాణసంచా కాల్చడాన్ని అనుమతించకపోవడం ఇలా ఎన్నో చర్యలు చేపడుతూనే ఉంది.
తాజాగా ఈ ఏడాది కూడా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇండిపెండెంట్ ఎన్విరాన్‌మెంటల్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నివేదిక ప్రకారం ఢిల్లీలో ఏర్పడుతున్న కాలుష్యంలో 31 శాతం రాజధానిలోని పలు ప్రాంతాల నుంచి ఏర్పడగా మిగిలిన 69 శాతం ఎన్‌సీఆర్ పరిధిలోని నుంచే వస్తోందని తెలిపింది.

బాణసంచా, చెత్తను కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాలని, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించాలని కోరారు. ఫ్యాక్టరీల్లో కాలుష్య ఇంధనాలను ఫైన్డ్ నేచురల్ గ్యాస్‌గా మార్చాలని, ఇటుక బట్టీల పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి జిగ్ జాగ్ టెక్నాలజీ ఉపయోగించాలని.. డీజిల్ జనరేటర్లపై ఆధారపడకుండా ఎన్‌సీఆర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ అందుబాటులో ఉంచాలని ఢిల్లీ మంత్రి కోరారు.

అయితే కేవలం సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్ 6 బస్సులు మాత్రమే నడవాలంటే అవి కేవలం 150 వాహనాలు మాత్రమే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక నవంబర్ 1 నుంచి డీజిల్ బస్సులు బంద్ చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.