కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి నుంచి మహాభారతం

గత ఏడాది ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’, ‘ది వాక్సిన్  వార్‌’ చిత్రాలతో సక్సెస్‌ అందుకున్నారు బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి. తాజాగా ఆయన తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ‘మహాభారతం’ఆధారంగా తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తునట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు. 

కన్నడ రచయిత ఎన్‌.ఎల్‌.బైరప్ప మహాభారతం ఆధారంగా రచించిన ‘పర్వ’ అనే పుస్తకాన్ని వివేక్‌ అగ్నిహోత్రి సినిమా రూపంలో తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని వివేక్‌ అగ్నిహోత్రి ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ చిత్రానికి ‘పర్వ’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుపుతూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ధర్మానికి సంబంధించిన ఓ పురాణకథ’ అనేది ట్యాగ్‌లైన్‌.

ఇలాంటి ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని, త్వరలో ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తీసుకురాబోతున్నట్లు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.  ఈ చిత్రాన్ని పల్లవి జోషి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.

ఇక ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా దాదాపుగా ది కాశ్మీర్‌ ఫైల్స్‌, ది వ్యాక్సిన్‌ వార్ సినిమాల్లోని నటీనటులనే ఈ ప్రాజెక్ట్‌లో తీసుకోబోతున్నారట.  అయితే టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎంతో కాలంగా ‘మహాభారతం’ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆయనకన్నా ముందు బాలీవుడ్ దర్శకుడు వివేక్ ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. 

తాజాగా వివేక్‌ అగ్నిహోత్రి ‘ది వ్యాక్సిన్‌ వార్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడానికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్తల గురించి చాటి చెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అయితే ఈ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాతో వివేక్‌ అగ్నిహోత్రి సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర కళ్లు చెదిరే కలెక్షన్‌లు కొల్లగొట్టింది. గత ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.350 కోట్లు కొల్లగొట్టి హిందీ నాట సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఉత్తరాదిన మాత్రం దాదాపు నెల రోజుల పాటు చాలా చోట్ల హౌజ్‌ఫుల్‌ బోర్డులు పడ్డాయి.