తెలంగాణాలో ఎటు చూసినా నోట్ల కట్టలు.. రూ 243 కోట్లు పట్టివేత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఈ సారి ధనప్రభావం విపరీతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన్నప్పటి నుండి పోలీసుల తనిఖీలలో ఎటుచూసినా నోట్ల కట్టలు, బంగారం వంటి ఆభరణాలు దర్శనమిస్తున్నాయి. 2018 ఎన్నికల సందర్భంగా మొత్తం మీద కేవలం రూ. 103 కోట్లు మాత్రమే పెట్టుబడిగా, ఈ పర్యాయం ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల  కాకుండానే, ఎన్నికల కోడ్ అమలులోకి  వచ్చిన తొలి 11 రోజులలో అంతకన్నా  రెట్టింపుకు పైగా రూ. 243 కోట్లు పట్టుబడింది.
 
గురువారం ఉదయం నాటికే పోలీసులు పలు జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న అన్నింటి విలువ మొత్తంగా రూ.243,76,19,296 కోట్లు. ఇక నామినేషన్ల ఘట్టం, ప్రచారం, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇంకా ఎంత మొత్తం స్వాధీనం చేసుకుంటారో చూద్దామని కేంద్ర ఎన్నికల సంఘమే తెలంగాణపై ఉత్సుకతతో ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. కాగా, తాజాగా ఆభరణాలు అన్నింటికీ రసీదులు ఉండబోవని, వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం వల్ల తమ ఉపాధి దెబ్బ తింటున్నదని స్వర్ణకారుల సంఘం వాపోతోంది. ఎన్నికల సందర్భంగా తెలంగాణలో స్వల్పకాలంలోనే స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, ఆభరణాలు, కానుకలు పెద్ద మొత్తంలో పెరిగాయని ఈసీ మరింత నిఘా పెడుతోంది. 

ఈ క్రమంలోనే గత ఫిర్యాదులు, తాము ఉర్తించి అంశాల ఆధారంగానే కాకుండా ఇంకా ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర అధికారులను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసింది. అనంతర పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితమైన ఆదేశాలనివ్వడంతో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 

సరిహద్దుల్లో 148 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. సరైన వివరాలు లేని నగదు, ఆభరణాలతో పాటు అక్రమంగా సరఫరా చేస్తున్న మద్యం, కానుకలు, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నెల 9  నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ. 87కోట్ల 92 లక్షలుకాగా, అక్రమ సరఫరా ద్వారా పట్టుబడిన మద్యం 65223 లీటర్లు. 18,874 కిలోల నల్ల బెల్లం, 655 కిలోల ఆలం కాగా.. వాటి విలువ రూ.10.21కోట్లు. 

రూ.7.72 కోట్ల విలువైన 2950 కిలోల గంజాయి పట్టుబడింది. సరైన ఆధారాలు, పత్రాలు, వివరాలు లేని 181 కిలోల బంగారు, 693 కిలోల వెండి, 154 క్యారట్ల వజ్రాలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.120 కోట్ల 40 లక్షలకు పైగా ఉంది. వీటితో పాటు రూ.17.48 కోట్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి, బియ్యం మొదలైన వస్తువులు పటుబడ్డాయి.

2018 ఎన్నికల సమయంలో రూ.97 కోట్ల నగదు, 2.3 కోట్ల విలువైన మద్యం, రూ.42 లక్షల విలువైన మత్తు పదార్థాలు, 3.2 కోట్ల బంగారం, వెండి, తదితర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మరో రూ. 34 కోట్ల విలువైన ఇతర వస్తువులు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నగదు, అన్ని వస్తువులను కలిపితే 2018 ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ రూ.137 కోట్ల 97 లక్షలు మాత్రమే.