కేసీఆర్ అధికారం లేకపోతే ఉండలేరు

తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అధికారం ఇచ్చినా రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని  చెబుతూ కేసీఆర్ అధికారం లేకపోతే ఉండలేరని, అందుకే అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు సార్లు కేసీఆర్‌ సీఎంగా చేసినా అభివృద్ధి మాత్రం శూన్యమని ధ్వజమెత్తారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సోమవారం నిర్వహించిన బీజేపీ జనగర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేవలం కేసీఆర్‌ ఒక్కరే పోరాటం చేయలేదని, బిజెపి కూడా పోరాడిందని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పారు. 
 
కాంగ్రెస్ వారి వైఫల్యం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో సమస్యలు పరిష్కారం కావడంలేదని విమర్శించారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయాంలో బీజేపీ ఏర్పాటుచేసిన మూడు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని గుర్తు చేశారు.  కేసీఆర్‌ పాలనలో అవినీతి పెరిగిందని, తెలంగాణలో కేవలం సీఎం కుటుంబం మాత్రమే లాభపడిందని, ప్రజలు నష్టపోయారని మండిపడ్డారు. 
 
రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ అభినందించారు. హుజురాబాద్‌ ఉపఎన్నికలో కేసీఆర్‌ స్వయంగా ప్రచారం చేపట్టినా, విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టినా రాజేందర్‌ను ఓడించలేకపోయారని కొనియాడారు.
 
యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని ఈ సభా వేదికగా సీఎం కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న కేసీఆర్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని కేసీఆర్‌ ప్రభుత్వం యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
కేవలం బీజేపీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతుందని, బీఆర్ఎస్ మాత్రం కుటుంబ పాలనకే ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. రాణి రుద్రమదేవి, కుమురంభీమ్‌ లాంటి ఎంతో మంది వీరులను కన్న పుణ్యభూమి తెలంగాణ అని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. తెలంగాణలో తమకు అధికారం ఇవ్వాలని కోరుతూ ఒక్కసారి ఛాన్స్ ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 
తెలంగాణకు అనుకూలంగా 2007లోనే బిజెపి తీర్మానం చేసిందని, 2014లో తెలంగాణ బిల్లును ఆమోదింప చేసిన ఘనత తమ పార్టీదేనని బిజెపి నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆ సమయంలో రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షుడిగా ఉన్నారని గుర్తు చేశారు. దేశాభివృద్ధికి చిన్న రాష్ట్రాల ఏర్పాటు సరైనదని తీర్మానం చేసింది జనసంఘ్ పేర్కొంటూ తెలంగాణ ఏర్పాటు చేయాలని రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్‌లు కోరినట్లు చెప్పారు.
మంత్రి పదవి కంటే ప్రజల కోసం పని చేసిన వ్యక్తిని తానే అంటూ ఇలా ప్రతి దానిని తాను అడ్డుకున్నానని, అందుకే తాను ఏకుమేకవుతున్నానని కెసిఆర్ భావించి తనను బలి చేశాడని కేసీఆర్ పై ధ్వజమెత్తారు.