మరోసారి తెరపైకి అమరావతి అసైన్డ్ భూముల కేసు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తోంది ఏపీ సీఐడీ. ఇప్పటికే పలు కేసుల్లో వరుసగా పీటీ వారెంట్లు దాఖలు చేస్తుండగా ఇప్పుడు కొత్తగా అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ కేసులో సరికొత్త ఆధారాలు లభించటంతో, కొత్త రెండు పిటిషన్లను దాఖలు చేయటం కీలక పరిణామంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం అసైన్డ్ భూములను భారీగా సేకరించింది. ఇందులో భారీగా అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించింది సీఐడీ.  ఈ కేసులో ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రిగా పని చేసిన నారాయమపై అభియోగాలు ఉన్నాయి. సీఐడీ విచారణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు మార్చి 19న హైకోర్టు స్టే విధించింది. 

మరోవైపు కేసును కొట్టేయాలంటూ చంద్రబాబుతో పాటు నారాయణ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే దాదాపు వాదనలు ముగిశాయి. అక్టోబర్ 16న తేదీన తీర్పు రాబోతుంది. తీర్పు వచ్చే క్రమంలో సీఐడీ తాజాగా కొత్తగా రెండు పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి సీఐడీకి మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగూరు కృష్ణప్రియ కొన్ని ఆడియో, వీడియో ఆధారాలు అందజేశారని తెలుస్తోంది. 

ఇందులో నారాయణ, తదితరులు ఏ విధంగా భూములు కొనుగోలు చేశారు? అనే విషయాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల మేరకు సమాచారం. అయితే సీఐడీ కొత్తగా పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో  హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఉత్కంఠగా మారింది.

స్కిల్ కేసు దర్యాప్తు సీబీఐకి
 
మరోవంక, చంద్రబాబు నాయుడు అరెస్టుకు దారితీసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. స్కిల్ కేసులో ఇప్పటికే ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ విచారణ సందర్భంగా స్కిల్ కేసులో సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేదని అడ్వొకేట్ జనరల్ తెలిపినట్లు సమాచారం.
 
తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే స్కిల్ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ నిర్ణయం తీసుకోవాలని కోర్టులను ప్రభుత్వం కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.