పాలస్తీనాపై భారత్ విధానం స్పష్టం

పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందడన్ని భారత్ సమర్థిస్తుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ వాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ విలేఖరుల సమావేశంలో పాలస్తీనాపై భారత్ వైఖరిని స్పష్టం చేశారు. అయితే, ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఉగ్రచర్యగా భావిస్తామని తేల్చి చెప్పారు.

‘ఇజ్రాయెల్‌పాలస్తీనా విషయంలో భారత్ వైఖరి చాలాకాలంగా స్థిరంగా ఉంది. ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా చర్చలు జరిపి, గుర్తింపు పొందిన సరిహద్దుల్లో నివసిస్తూ సార్వభౌమాధికారం , పూర్తి స్వతంత్రతతో వ్యవహరించే పాలస్తీనా ఏర్పాటును భారత్ ఎల్లప్పుడూ సమర్థిస్తుంది. ఇందుకోసం పాలస్తీనా, ఇజ్రాయెల్‌లు నేరుగా సంప్రదింపులు జరపాలని భారత్ ఆశిస్తోంది’ అని బాగ్చీ తెలిపారు.

ఇజ్రాయెల్‌లో మానవతా పరిస్థితులపై స్పందిస్తూ ఇరువర్గాలు అంతర్జాతీయ మానవతా చట్టాలను పాటించాలని సూచించారు. అదే సమయంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్ కు భారత్ ఆయుధపరంగా సాయం అందిస్తుందా? అన్న విలేఖరుల ప్రశ్నకు ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు రావడంపైనే దృష్టిసారించినట్లు బాగ్చీ చెప్పారు. ఇజ్రాయెల్‌లో 18,000 మంది భారతీయులు ఉన్నట్లు ఆయన చెప్పారు. గాజాలో నలుగురు, వెస్ట్‌బ్యాంక్‌లో 12 మంది భారతీయులున్నట్లు కూడా ఆయన తెలిపారు.