20 నాటికి తెలంగాణాకు 100 కంపెనీల కేంద్ర బలగాలు

* రూ 37 కోట్ల నగదు, బంగారం, మధ్య, మాదకద్రవ్యాలు స్వాధీనం
తెలంగాణాలో శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం 100 కంపెనీల కేంద్ర సాయుధ దళాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 20వ తేదీ నాటికి ఈ బలగాలు రాష్ట్రవ్యాప్తంగా మోహరిస్తాయి. ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇవి విధులు నిర్వహించనున్నాయి. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.37 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బుధవారం ఉదయం నుంచి పట్టుబడిన మొత్తం విలువ రూ.12 కోట్లకు పైగా ఉంది. 

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికార, పోలీసు యంత్రాంగం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోదాలు చేపడుతున్నారు. అనేక ప్రాంతాల్లో చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహన తనిఖీల్లో ప్రతి రోజూ కోట్ల కొద్దీ నగదు, మద్యం బాటిళ్లు బయటపడుతున్నాయి.

జిహెచ్‌ఎంసి పరిధిలో బాలానగర్‌లో రూ. 10 లక్షలు, చైతన్యపురి ఎక్స్ రోడ్డులో రూ. 33.50 లక్షలు జప్తు చేశారు. కూకట్ పల్లి పరిధి ప్రశాంత నగర్, మూసాపేట్, భాగ్యనగర్ కాలనీల్లో సరైన పత్రాలు లేని 8 మంది వాహనదారుల నుంచి  రూ.21.69 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.  ఇక రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ. 20.43 కోట్లు కాగా, రూ. 86.92 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటి వరకు రూ. 89.02 లక్షల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. ఇప్పటి వరకు 31 కిలోలకు పైగా బంగారం, 350 కిలోల వెండి, 42 క్యారట్ల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం  రూ.14.65 కోట్లు.  గురువారం రూ. 22.51 లక్షల విలువైన ల్యాప్‌టాప్లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

శాంతిభద్రతల్లో భాగంగా ఇప్పటి వరకు 1196 మందిపై కేసులు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా 75 వేలకు పైగా ప్రజల, ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి, వాటిపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు నమోదు చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా అంతర్ రాష్ట్ర సరిహద్దులు 89, ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులు 169 ఏర్పాటు చేశారు. ప్రజల ఆస్తులకు సంబంధించి నమోదైన కేసులు 34,338,- ప్రజలు ఆస్తులపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు 22,132,ప్రైవేటు ఆస్తులకు సంబంధించి కేసులు : 11,434, ప్రైవేటు ఆస్తులపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు 7,322 గా నమోదు చేశారు.

ఇలా ఉండగా, పలువురు కలెక్ట ర్లు, కమిషనర్లను బదిలీ చేయాలంటూ కేంద్ర ఎ న్నికల సంఘం పంపిన ఆదేశాలను రాష్ట్ర ప్రభు త్వం అమలు చేసింది. ఈ మేరకు అధికారుల బదిలీ, ఆ స్థానాల్లో ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల చొప్పున ప్యానెల్ జాబితాను ఎన్నికల సంఘానికి పంపింది.  మొత్తం నలుగురు కలెక్ట ర్లు, ముగ్గురు పోలీస్ కమిషనర్లులు, 10 మంది ఎస్పీలతో రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల కార్యదర్శులు, కమిషనర్ల పోస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రతి పోస్టుకు ముగ్గురి పే ర్లతో ప్యానెల్ జాబితాను పంపారు. 
 
అందులో భాగంగా పోలీస్ శాఖలో బదిలీ అయిన కమిషనర్లు, ఎస్పీల స్థానంలో కొత్త పోస్టింగ్ కోసం డిజిపి అంజనీకుమార్ ఒక్కో పోస్టుకు సీనియారిటీ ప్రాతిపదికన ముగ్గురు ఐపిఎస్‌లను పేర్లను సూ చిస్తూ జాబితాను సిఎస్‌కు పంపించారు. ఈ ప్యానెల్ నుంచి ఒక్కొక్కరిని కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేయనుంది.